Friday, May 3, 2024

సికింద్రాబాద్ స్టేషన్‌లో యూజర్ చార్జీల అమలుకు రంగం సిద్ధం !

- Advertisement -
- Advertisement -

ఏ-1 పునరాభివృద్ధిలో భాగంగా తొలుత ఏసి ప్రయాణికులపై భారం

Passengers will pay User charges

మనతెలంగాణ/హైదరాబాద్:  దక్షిణమధ్య రైల్వే పరిధిలో తొలిసారిగా సికింద్రాబాద్ స్టేషన్‌లో యూజర్ చార్జీల అమలుకు రంగం సిద్ధమయ్యింది. ఈ స్టేషన్‌లో రైలెక్కే ప్రయాణికులు ఇకపై యూజర్ చార్జీలు చెల్లించాల్సిందే. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన సుమారు వెయ్యి స్టేషన్ల (ఏ-1)పునరాభివృద్ధిలో భాగంగా విమానాశ్రయాల తరహాలో ప్రయాణికుల నుంచి యూజర్ చార్జీలు వసూలు చేయాలని ఇటీవల రైల్వే బోర్డు నిర్ణయించిన నేపథ్యంలో ఈ జాబితాలో సికింద్రాబాద్ స్టేషన్‌కు చోటుదక్కింది. అయితే తొలుత ఏసీ బోగీల్లో ప్రయాణించే వారి నుంచి యూజర్ చార్జీలను వసూలు చేయాలని నిర్ణయించినట్టుగా తెలిసింది. ఫస్ట్ ఏసీ ప్రయాణికులపై రూ. 25 వరకు, సెకండ్, థర్డ్ ఏసీ ప్రయాణికులపై రూ. 20లోపు ఈ చార్జీలు విధించే అవకాశం ఉన్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. సాధారణ బోగీలు, ప్యాసింజర్, ఎంఎంటిఎస్ రైళ్లను యూజర్ చార్జీల నుంచి మినహాయించే అవకాశం ఉన్నట్టుగా సమాచారం.

రెండో విడతలో నాంపల్లి, కాచిగూడ, విజయవాడ, తిరుపతి

ప్రస్తుతం ప్రధాన ఎక్స్‌ప్రెస్ రైళ్ల ఏసీ బోగీల ప్రయాణికుల నుంచే చార్జీల వసూలును పరిమితం చేసినప్పటికీ దశలవారీగా స్లీపర్ క్లాస్, ఇతర కేటగిరీలకు దీనిని వర్తింపజేసే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. సికింద్రాబాద్ తరువాత క్రమంగా నాంపల్లి, కాచిగూడ, విజయవాడ, తిరుపతి స్టేషన్‌లకు యూజర్ చార్జీలను విస్తరించనున్నారు. వాస్తవానికి గతంలోనే రైల్వే బోర్డు ఈ ప్రతిపాదన చేసినప్పటికీ దేశంలో కరోనా వ్యాప్తి కారణంగా దీని అమలు వాయిదాపడింది.
స్టేషన్ రీ-డెవలప్‌మెంట్‌కు త్వరలోనే టెండర్లను
సికింద్రాబాద్ స్టేషన్‌లో వాహనాల పార్కింగ్, టాయిలెట్లు, తాగునీరు, విశ్రాంతి గదుల వంటి సేవలన్నీ పూర్తిగా ప్రైవేటు సంస్థల నిర్వహణలోనే ఉన్నాయి. సికింద్రాబాద్ స్టేషన్ పునరాభివృద్ధి కోసం ఇండియన్ రైల్వేస్టేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఐఆర్‌ఎస్‌డిసి) గతంలోనే ప్రణాళికలను సిద్ధం చేసినప్పటికీ కరోనా దృష్ట్యా ఇన్వెస్టర్లు ముందుకు రాలేదు. ఎయిర్‌పోర్టు తరహాలో స్టేషన్ రీ-డెవలప్‌మెంట్‌కు త్వరలోనే టెండర్లను ఆహ్వానించనున్నట్లు ఐఆర్‌ఎస్‌డిసి అధికారులు తెలిపారు. ఈ క్రమంలో యూజర్ చార్జీలను వసూలు చేయాలని నిర్ణయించినట్టుగా సమాచారం.

రోజుకు రూ. 1.65 కోట్ల ఆదాయం

సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రైల్వేకు నిత్యం రూ. 1.65 కోట్ల వరకు ఆదాయం లభిస్తుంది. 80 రైళ్ల వరకు నడిచే దూరప్రాంత రైళ్లలో సుమారు 30 వేల మంది ఏసీ బోగీల్లో ప్రయాణిస్తుంటారు. ప్రయాణికులపై సగటున రూ.25 చొప్పున యూజర్ చార్జీలు విధిస్తే రోజుకు రూ.7.5 లక్షల ఆదాయం లభించనుంది. సేవల్లో నాణ్యతను పెంచేందుకు యూజర్ చార్జీలను వసూలు చేయాలని నిర్ణయించినట్టు అధికారులు తెలిపారు. రీడెవలప్‌మెంట్‌లో భాగంగా సుమారు 2.5 ఎకరాల స్థలంలో షాపింగ్ మాల్స్, ఎంటర్‌టైన్‌మెంట్, హోటల్స్ వంటివి కూడా త్వరలో ఏర్పాటు చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News