మార్చి 4 వరకు కొనసాగే పట్టణ ప్రగతికి శ్రీకారం
మహబూబ్నగర్ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి కెటిఆర్
అన్ని గృహ సముదాయాల్లో విధిగా ఇంకుడు గుంతలు
పౌరసేవలు మరింత మెరుగుపడేలా కృషి
మంత్రులు, స్థానిక ఎంఎల్ఎలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం
పట్టణ పారిశుద్ధ్యానికి, పరిశుభ్రతకు, పచ్చదనానికి ప్రాధాన్యం
– అన్ని పురపాలికలకు ప్రభుత్వం మార్గదర్శకాలు
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ పట్టణ ప్రజల జీవితాల్లో గుణాత్మకమైన మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా ‘పట్టణ ప్రగతి’ కార్యక్రమం నేడు( సోమవారం) ప్రారంభం కానున్నదని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె. తార క రామారావు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణ ప్రగతి కార్యక్రమానికి సంబంధించి మంత్రి కెటిఆర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టణాల రూపురేఖలను మార్చి, ప్రతి వార్డును ప్రణాళికాబద్దంగా, సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా చేపడుతోన్న ఈ పట్టణ ప్రగతి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను జాగృతం చేయనున్నదని ఆయన వెల్లడించారు. ప్రభుత్వం ఇదివరకే చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతం కావడంతో… ఇదే స్పూర్తితో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. పట్టణ ప్రగతి పనులను సమీక్షించేందుకు ప్రతి వార్డుకు ప్రత్యేక అధికారిని నియమించినట్టు మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా అన్ని గృహ సముదాయాల్లో ఇంకుడు గుంతలను విధిగా ఏర్పాటు చేయాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంతో పౌర సేవలను మరింత మెరుగుపర్చేందుకు కృషి చేయాలని మంత్రి తెలిపారు. ఆయా పట్టణాల్లో మంత్రులు, స్థానిక ఎంఎల్ఎలు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. పట్టణాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దడమే లక్షంగా పనిచేయాలన్నారు. రాష్ట్రంలోని పురపాలికల రూపురేఖలు మార్చడమే ప్రధాన ఉద్దేశ్యంగా ముఖ్యమంత్రి కెసిఆర్ మార్గనిర్దేశకత్వంలో ఈ కార్యక్రమం రూపుదిద్దుకుందని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. నేడు(సోమవారం) మహబూబ్ నగర్ పట్టణంలో జరుగనున్న పట్టణ ప్రగతి కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొననున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలు, పట్టణాల్లో మంత్రులు, స్థానిక ఎంఎల్ఏలు పాల్గొననున్నారు. పట్టణ ప్రగతి నేటి నుంచి మార్చి 4వ తేదీ వరకు కొనసాగనున్నదని ఆయన తెలిపారు.
పట్టణ ప్రగతిని విజయవంతం చేసేందుకు కావాల్సిన కార్యచరణ చేపట్టేందుకు ఇప్పటికే అన్ని పురపాలికలకు ప్రభుత్వం మార్గదర్శకాలను చేరవేసిందని, పట్టణాల్లోని ప్రజల జీవితాలను మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు అవసరమైన అన్ని కార్యక్రమాలను తీసుకోవాలని ఆయన సూచించారు. ముఖ్యంగా పారిశుద్ధ్యం, పచ్చదనం, మౌలిక వసతుల కల్పన, పౌర సేవలను మరింతగా మెరుగు పరచడం వంటి ప్రధానమైన ప్రాథమిక లక్ష్యాలను ఈ కార్యక్రమంలో నిర్ణయించినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణ లో భాగంగా చెత్తను తరలించడంతో పాటు మురికి కాలువల శుభ్రం బహిరంగ ప్రదేశాల శుభ్రపరచ్చడం వంటి కార్యక్రమాలను చేపట్టాలని తెలిపారు. పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వార్డ్ యూనిట్గా ఈ కార్యక్రమం చేపట్టాలని ప్రతి వార్డుకి ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని పురపాలక శాఖ అధికారులు మార్గదర్శకాలను విడుదల చేశారు.
రానున్న పది రోజులకు అవసరమైన కార్యక్రమాలను ముందే రూపొందించుకొని ప్రణాళికాబద్ధంగా పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, రహదారుల నిర్వహణ, పచ్చదనం, నర్సరీలు ఏర్పాటు, పబ్లిక్ టాయిలెట్స్ కోసం అవసరమైన స్థలాల గుర్తింపు వంటి పలు కార్యక్రమాలను గుర్తించింది. పట్టణాల్లో ప్రజల ఆరోగ్యాన్ని మెరుగు పరిచేందుకు అవసరమైన ప్రజారోగ్య పర్యవేక్షణ కార్యక్రమాలను, ఇందుకు అవసరమైన ఇయర్ క్యాలెండర్ ను ప్రకటించాలని మంత్రి కోరారు. పట్టణ ప్రగతి ద్వారా పర్యావరణ పరిరక్షణ కోసం అవసరమైన కార్యక్రమాలను చేపట్టాలని ఇందులో భాగంగా ఘన వ్యర్ధాల, నిర్మాణ మరియు కూల్చివేత వ్యర్థాలను చెరువులో కలపకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని, అన్ని గృహ సముదాయాల్లో ఇంకుడు గుంతల ఏర్పాటు కార్యక్రమాన్ని సైతం చేపట్టాల్సిందిగా కోరారు.
దీంతోపాటు పట్టణ ప్రగతిలో పౌరుల భాగస్వామ్యం అనేది అత్యంత కీలకమైన అంశమని ఇందుకోసం ప్రతి వార్డు వార్డు లో కమిటీలను ఏర్పాటు చేసి కనీసం మూడు నెలలకు ఒకసారి వార్డు కమిటీల సమావేశం నిర్వహించడం , వివిధ అంశాలను చర్చించి వాటిపైన తగు చర్యలు తీసుకోవడం వంటి అనేక లక్ష్యాలను ప్రగతి లో భాగంగా చేపట్టనున్నట్లు తెలిపారు. నూతనంగా ఎన్నికైన పురపాలక ప్రతినిధులు ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని ప్రజలు తమకు అందించిన ఆశీర్వాదాన్ని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి నిర్దేశించిన పట్టణ ప్రగతి లక్ష్యాలను అందుకునేందుకు అందరూ కృషి చేయాలని పురపాలక ప్రజాప్రతినిధులతో పాటు పురపాలక శాఖ అధికారులను మంత్రి కోరారు.