మనసు మార్చుకున్న ఇండియా
న్యూఢిల్లీ : ఫైజర్, మాడెర్నా టీకాలను భారతదేశం విదేశాల నుంచి తెప్పించుకునే ప్రసక్తే లేదని స్పష్టం అయింది. దేశీయంగా తయారు అవుతున్న వ్యాక్సిన్ల కోటా పెరుగుతోంది. పైగా స్థానికంగా వీటిని నిల్వ చేసుకోవడం తేలిక అవుతుంది. ఈ దశలో విదేశాల నుంచి వ్యయ భారం, సాంకేతిక క్లిష్టతలతో విదేశీ టీకాలను ఎందుకు తీసుకోవడం అని ఇండియా భావిస్తోంది. ఈ విషయాన్ని ప్రభుత్వ వర్గాలు ఇటీవలే రాయిటర్ వార్తా సంస్థకు తెలిపాయి. కరోనా ఉధృతి దశలో ఇండియాలో వ్యాక్సిన్ల లభ్యత తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు ప్రపంచ స్థాయి ప్రఖ్యాత వ్యాక్సిన్లు ఇండియాకు పంపించడానికి ఆయా దేశాలు ముందుకు రాలేదు. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. భారతదేశంలోనే అత్యధిక సంఖ్యలో టీకాల ఉత్పత్తి జరుగుతోంది. వ్యాక్సినేషన్ వేగవంతం అవుతోంది. పైగా ఇతరదేశాల వ్యాక్సిన్లు నిల్వచేసుకోవడానికి సాంకేతిక సమస్యలు ఏర్పడుతున్నాయి. అత్యంత శీతల ఉష్ణోగ్రతలలో వీటిని నిల్వ చేయాల్సి ఉంటుంది. ఈ సాధకబాధకాలను పరిగణనలోకి తీసుకుని స్వదేశీ టీకాలకు ప్రాధాన్యత ఇవ్వాలని భారతదేశం సంకల్పించింది. ఫైజర్, మాడెర్నా టీకాలకు ఇండియాలో ఇప్పటికైతే అత్యవసర వాడకపు అనుమతి దక్కింది.