హైదరాబాద్: అటవీ ఉద్యోగులు క్రీడల ద్వారా శారీరక, మానసిక వికాసం పొందుతారని రాష్ట్ర న్యాయ, అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం దుండిగల్ ఫారెస్టు అకాడమీ మైదానంలో అటవీ ఉద్యోగుల ఐదవ రాష్ట్ర స్థాయి అటవీ క్రీడా మీట్2020ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిత్యం విధుల నిర్వహణలో బిజీగా ఉండే అటవీ ఉద్యోగులు క్రీడల ద్వారా ఉపశమనం పొందుతారని పేర్కొన్నారు. క్రీడల వల్ల మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యం మెరుగుపడుతుందన్నారు.
క్రమం తప్పకుండా క్రీడలల్లో పాల్గొనడం ద్వారా చక్కటి పని తీరును కనబర్చడానికి క్రీడలు దోహదపడుతాయని తెలిపారు. 800 మంది ఉద్యోగులు రాష్ట్ర స్థాయి క్రీడా పోటిల్లో పాల్గొనడం సంతోషదాయకం అని వెల్లడించారు. క్రీడలల్లో అటవీ శాఖ ఉద్యోగులను ప్రొత్సహించడానికి, నైపుణ్యాల పెంపొందించడానికి స్పోర్ట్ మీట్లు ఘనంగా నిర్వహించడం పట్ల అటవీ శాఖ ముఖ్య సంరక్షణాధికారి ఆర్.శోభను ఇతర అధికారులను మంత్రి అభినందించారు.
ఈ ఏడాది మార్చిలో భువనేశ్వర్లో నిర్వహించే 25వ అల్ ఇండియా క్రీడా మీట్లో తెలంగాణ రాష్ట్రానికి చేందిన క్రీడాకారులు ప్రతిభ కనబర్చాలని మంత్రి ఆకాంక్షించారు. ఉద్యోగుల అభివృద్ధి, సంక్షేమాలతో పాటు క్రీడాభివృద్ధి అంశాలపై సిఎంకెసిఆర్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించారు. గతంలో ఎన్నడు లేని విధంగా అడవుల సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తుందని వెల్లడించారు. తద్వారా రాష్ట్రంలో వన్యప్రాణుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు.
హరిత హారం కార్యక్రమం ద్వారా మొక్కలను నాటి సంరక్షిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో అటవీ అభివృద్ధి చైర్మన్ వంటేరు ప్రభాకర్ రెడ్డి, అటవీ శాఖ పత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, ముఖ్య సంరక్షణాధికారి శోభ, అటవీ అభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రఘవీర్, ఫారెస్టు అకాడమీ డైరెక్టర్ మునీంద్రా, అదనపు పిసిసిఎప్ దోబ్రియల్, స్వర్గం శ్రీనివాస్, లోకేష్ జైస్వాల్, పర్గెయిస్, ఫారెస్టు అకాడమీ సలహాదారు తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.