Sunday, May 19, 2024

బుద్ధుడు బోధనలే ప్రపంచ సవాళ్లకు పరిష్కారం: ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రపంచం ఇప్పుడు ఆర్థిక అస్థిరత, ఉగ్రవాదం, మత తీవ్రవాదం, వాతావరణ మార్పులు లాంటి సవాళ్లను ఎదుర్కొంటోందని ప్రధాని నరేంద్ర మోడీ అంటూ, బుద్ధుడి బోధనలు ఈ సమస్యలకు పరిష్కారం అందిస్తాయని అన్నారు. గురువారం ఇక్కడ ప్రపంచ బౌద్ధ సమ్మేళనం ప్రారంభ సమావేశంలో ప్రధాని మాట్లాడుతూ.. సంపన్న దేశాలపై పరోక్షంగా విమర్శలు కురిపించారు. గత శతాబ్దంలో ఈ దేశాలు ఇతరుల గురించి, రాబోయే తరాల గురించి ఆలోచించకపోవడం వల్లనే ప్రపంచ దేశాలు ఇప్పుడు వాతావరణ మార్పు సమస్యను ఎదుర్కొంటున్నాయని ఆయన అన్నారు. దశాబ్ద్దాల పాటు ఆ దేశాలు ప్రకృతి తమపై ప్రభావం చూపించకుండా ఉండాలనే దాని గురించే ఆలోచించాయి. వాళ్లు దాన్ని ఇతరులపై పడేయడం చేస్తూ వచ్చారన్నారు.

బుద్ధుడు చూపించిన బాట భావి తరాలకు, సుస్థిరతకు బాట అని ప్రధాని అంటూ, ‘ప్రపంచం గనుక ఆయన బోధనలను పాటించి ఉంటే వాతావరణ మార్పు సమస్యను అది ఎదుర్కొని ఉండేది కాదు’ అని అన్నారు. అంతేకాదు బుద్ధుడి బోధనలతో స్ఫూర్తిపొందిన భారత్ ప్రపంచ సంక్షేమం కోసం కొత్త చొరవలు తీసుకొంటోందని ప్రధాని అన్నారు. ఢిల్లీలోని అశోకా హోటల్‌లో రెండు రోజుల పాటు జరగనున్న ఈ బౌద్ధ మహాసభలను కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ కాన్ఫెడరేషన్ సహకారంతో నిర్వహిస్తోంది. ఈ సదస్సుకు భారత్‌తో పాటుగా 30 దేశాలనుంచి ప్రతినిధులు హాజరవుతున్పారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, కిరెన్ రిజిజులు కూడా పాల్గొన్నారు. ప్రసంగానికి ముందు ప్రధాని అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శించడంతో పాటుగా బుద్ధుడి విగ్రహానికి పూజలు నిర్వహించారు.19 మంది ప్రముఖ బౌద్ధ సన్యాసులకు సన్యాసి వస్త్రాలను కూడా ఆయన అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News