హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వార్షిక నేర నివేదికను డిజిపి మహేందర్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా డిజిపి మీడియాతో మాట్లాడారు. కరోనా, వరద కష్టాల్లో పోలీసులు ప్రజలకు అండగా నిలిచారని కొనియాడారు. అన్ని పోలీస్ స్టేషన్లలో ఒకే రకమైన సేవలు అందిస్తున్నామని, పోలీస్ సిబ్బందికి ఇచ్చిన నైపుణ్య శిక్షణ ఎంతో ఉపయోగపడుతోందని ప్రశంసించారు. డయల్ 100, 112తో పాటు సోషల్ మీడియా యాప్లతో ప్రజలకు అందుబాటులో ఉన్నామని, నేర రహిత, మావోయిస్టు రహిత తెలంగాణగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖ విజయవంతమైందన్నారు. నేరం చేస్తే దొరికిపోతామనే భయాన్ని నేరస్తుల్లో కలిగించామన్నారు. లాక్డౌన్ సమయంలో పోలీసుల సేవలను ప్రజలు ప్రశంసించారని గుర్తు చేశారు.
నేర రహిత తెలంగాణ లక్ష్యం సాధన దిశగా అడుగులు వేస్తున్నామని, గత సంవత్సరంతో పోలిస్తే రాష్ట్రంలో అన్ని రకాల నేరాలు తగ్గాయన్నారు. డయల్ 100కు ఫోన్ చేస్తే ఎనిమిది నిమిషాల్లో గస్తీ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుంటున్నాయన్నారు. తెలంగాణ వ్యాప్తంగా నేరాలు ఆరు శాతం, హత్యలు 8.5 శాతం, మహిళలపై నేరాలు 1.9 శాతం తగ్గాయన్నారు. 1.15 లక్షల మంది హ్యాక్ ఐ సర్వీసులు పొందారన్నారు. తెలంగాణలో ప్రవేశించేందుకు మావోలు చేసిన ప్రయత్నాలను తిప్పికొట్టామన్నారు. లాక్డౌన్ కాలంలో ప్రజల అవసరాలను తీర్చేందుకు పోలీసులు కృషి చేశారని డిజిపి ప్రశంసించారు.