Sunday, April 28, 2024

ఉగ్రవాదులకు షెల్టర్ జోన్‌గా నగరం: బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఉగ్రవాదులకు పాతబస్తీ అడ్డాగా మారిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉగ్రవాదులకు మజ్లిస్ పార్టీ ఆశ్రయం కల్పిస్తోందని మండిపడ్డారు. గతంలో ఉగ్రవాదులకు మద్దతుగా ఓవైసీ మాట్లాడారని గుర్తు చేశారు. పాతబస్తీలో నలుగురు ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారని.. ఇందులో ఓ వ్యక్తి ఓవైసీ చెందిన కాలేజీలో హెచ్ వోడీగా పనిచేస్తున్నాడని చెప్పారు. రాజకీయాల కోసం ఉగ్రవాద సంస్థలను మజ్లిస్ వాడుకుంటోందని ఆయన ఆరోపించారు. ఓట్ల కోసం ఉగ్రవాదులకు ఆశ్రయిస్తున్న మజ్లిస్‌ను బిఆర్‌ఎస్ వాడుకుంటోందని మండిపడ్డారు. కాంగ్రెస్ , బిఆర్‌ఎస్‌కు అధికారమే కావాలని…ప్రజల భద్రత అవసరం లేదన్నారు. హైదరాబాద్‌లోని ప్రజల ప్రాణాలు బాంబుల మీదున్నాయని.. హైదరాబాద్ ప్రజల భద్రతను బిఆర్‌ఎస్ గాలికి వదిలేసిందని చెప్పారు.

రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో హిజ్జు ఉత్ తహరీర్ (హెచ్‌యుటి) సంస్థ ఉగ్రవాదులు దొరికారు. ఈ సంస్థ ఐసిస్ కన్నా ప్రమాదకరంగా మారింది. రసాయన, జీవ ఆయుధాలతో దాడులు చేస్తూ భయోత్పాతం కలిగిస్తున్న సంస్థకు హైదరాబాద్ షెల్టర్ జోన్ గా మారడం ఆందోళన కలిగిస్తోంది. పట్టుబడ్డ హెచ్ యూటి ఉగ్రవాది మహ్మద్ సలీం డెక్కన్ మెడికల్ కాలేజీలో హెచ్‌ఓడిగా పనిచేస్తున్నాడు. మజ్లిస్‌కు ఉగ్రవాదులతో సంబంధం ఉందనడానికి ఇంతకంటే ఆధారాలేం కావాలి అని ఆయన ప్రశ్నించారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ కు చెందిన పౌరులు వీసా గడువు ముగిసినా హైదరాబాద్‌లోనే మకాం వేసి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే అనుమానం ఉందన్నారు. ఇన్నాళ్లు లవ్ జిహాద్ అనుకున్నం… ఇప్పుడు కొత్త రకం జిహాద్ నడుస్తోందన్నారు. హిందువులను ముస్లింలలో చేర్చి ఉగ్రవాదులుగా మార్చే పెద్ద కుట్ర జరుగుతోందన్నారు. హిందువులు కూడా టెర్రరిస్టులేననే ప్రమాదకర సంకేతాలు పంపే మహాకుట్ర అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా ఉగ్రవాద కార్యకలాపాలపై ముఖ్యమంత్రి సమీక్ష చేయాలి. సిఎంకు ముఖ్య సలహాదారుడు సోమేశ్‌కుమార్ ఓ అవినీతి అధికారి. ఆయనను ముఖ్య సలహాదారుడిగా నియమించడం సిగ్గు చేటు అనప్నారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మెకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని బండి సంజయ్ వెల్లడించారు. జెపిఎస్‌లతో పాటు ఒపిఎస్‌లను కూడా క్రమబద్దీకరించాలని ఆయన కోరారు. ఓఆర్‌ఆర్ 30 ఏళ్ల లీజుపై అవినీతి లేదు.. సిబిఐ విచారణకు సిద్ధమన్న సుధీర్‌రెడ్డి వ్యాఖ్యలపై.. దమ్ముంటే సిబిఐ విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయాలని డిమాండ్ చేశారు.సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఎస్.ప్రకాశ్ రెడ్డి, అధికార ప్రతినిధులు ఎన్‌వి సుభాష్, సిహెచ్.విఠల్, పోరెడ్డి కిశోర్ రెడ్డి, క్రిష్ణ ప్రసాద్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News