Sunday, April 28, 2024

రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే: పొంగులేటి

- Advertisement -
- Advertisement -

మహబూబాబాద్ : రాబోవు రోజుల్లో కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతుందని.. అందుకోసం కాంగ్రెస్ కార్యకర్తలు ఐక్యమత్యంలో విశ్రమించ కుండా పని చేయాల్సి ఉంటుందని మాజీ ఎంపీ, కాంగ్రెస్ క్యాంపెయిన్ కమిటీ వైస్ చైర్మైన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శుక్రవారం అర్భన్ కాంగ్రెస్ అద్యక్షులు ఘనపురపు అంజయ్య నేతృత్వంలో మహబూబాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన అర్భన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని శ్రీనివాస్‌రెడ్డి మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరాంనాయక్, ఆదివాసి కాంగ్రెస్ చైర్మైన్ డాక్టర్ బెల్లయ్యనాయక్‌లతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మానుకోట పట్టణంలోని ముత్యాలమ్మ దేవాలయం నుంచి అర్భన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా పెద్దెత్తున తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులతో పాటు కళాకారుల నృత్యాలు, డప్పు చప్పుళ్లతో ర్యాలీలో వాహనంపై శ్రీనివాస్‌రెడ్డి, బలరాంనాయక్, బెల్లయ్యనాయక్, వెన్నం శ్రీకాంత్‌రెడ్డి, ఘనపురపు అంజయ్యలు అభివాదం చేశారు. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ అంటూ పిక్కటిల్లేలా నినాదాలు చేశారు.

కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా స్థానిక నలంద గార్డెన్స్‌లో ఘనపురపు అంజయ్య అద్యక్షతన జరిగిన సభలో మొదట ఇటీవల మరణించిన గద్దర్ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ అమరవీరుల స్మారకార్ధం రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా వందలాదిగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులను ఉద్దేశించిన సభలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో దుర్మార్గపు కుటుంబ పాలన కొనసాగుతుందని ఆరొపించారు. ఇచ్చిన ఏ హామీని నిలుపుకోలేని పరిస్థితుల్లో కెసిఆర్‌ను నమ్మి రెండు సార్లు అధికారం ఇచ్చినా లాభం లేదనుకున్న జనాలు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అప్పడు ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారన్నారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ అదికారంలోకి రావడం తథ్యమని.. మనం ఎమరుపాటుతో ఉండకూడదని నిద్రాహారాలు మాని అయినా కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చేంత వరకు విశ్రమించకుండా మనమంత ఐకమత్యంతో పని చేయాలని పిలుపు నిచ్చారు. తెలంగాణే కాదు కేంద్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే రోజులు దగ్గర పడ్డాయని తేల్చి చెప్పారు. వరంగల్ రైతు, ఖమ్మం యూత్ డిక్లరేషన్లపై ప్రజల్లో విస్త్రతంగా ప్రచారం చేపట్టాలని కోరారు.

మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరాంనాయక్, ఆదివాసి కాంగ్రెస్ చైర్మైన్ డాక్టర్ తేజావత్ బెల్లయ్య నాయక్‌లు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలే కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువస్తాయని చెప్పారు. కాంగ్రెస్ మాత్రమే సుస్థిరమైన ప్రజాసుపరిపాలన అందిస్తున్న నమ్మకం ప్రజల్లో నెలకొందని చెప్పారు. పార్టీ శ్రేణులు నిరంతరం శ్రమిస్తూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చేపట్టే యూత్, రైతు డిక్లరేషన్లను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. వారి మోసాలతో ఇంకా ప్రజలను నమ్మే పరిస్థితులు లేవని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శులు పటేల్ రమేశ్‌రెడ్డి, వెన్నం శ్రీకాంత్‌రెడ్డి, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి ఎడవెల్లి కృష్ణ, రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి మద్ది శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్ అద్యక్షురాలు నూనావత్ రాధ, డోర్నకల్ కాంగ్రెస్ నేతలు డాక్టర్ రాంచంద్రునాయక్, నెహ్రూనాయక్, ఇతర నాయకులు ఎద్దల యాదవ్‌రెడ్డి, మేకల వీరన్న, తోటవెంకన్న, గుగులోతు వెంకట్‌నాయక్, రాజవర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News