Saturday, May 4, 2024

ముంబైలో తిరిగి కొవిడ్ భయాలు

- Advertisement -
- Advertisement -

Positivity rate reached 6 percent in mumbai

6 శాతంగా పాజిటివిటి రేటు

ముంబై : మహానగరం ముంబైలో ఇటీవలి దశలో కోవిడ్ కేసులు పెరిగాయి. సగటు పాజిటివిటి రేటు 6 శాతానికి చేరింది. దీనితో కొవిడ్ సంబంధిత పరీక్షలు ముమ్మరం చేశారు. స్థానిక పురపాలక సంస్థ బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బిఎంసి) వర్గాలు బుధవారం నగరంలో కొవిడ్ కేసుల పెరుగుదల గురించి తెలిపాయి. వెంటనే టెస్టులను యుద్ధ ప్రాతిపదికన పెంచాల్సి ఉందని సంబంధిత అధికారులకు కార్పొరేషన్ కార్యవర్గం ఆదేశాలు వెలువరించింది. టెస్టింగ్ ల్యాబ్‌లు మరింత క్రియాశీలం, కార్యాచరణం కావాలని, పూర్తి స్థాయి సిబ్బందితో సమాయత్తంగా ఉండాలని ఆదేశించారు. వర్షకాలం సమీపిస్తూ ఉండటంతో నగరంలో రోజువారి కేసుల సంఖ్య విపరీతంగా పెరిగింది. కొవిడ్ లక్షణాలు సోకిన వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోందని , అంతా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచనలు వెలువరించారు.

బూస్టర్ డోస్‌లు వేయండి, 12 నుంచి 18 ఏండ్లలోపు వారికి వ్యాక్సినేషన్‌ను పెంచండని మార్గదర్శకాలు వెలువరించారు. క్షేత్రస్థాయిలోని ఆసుపత్రులన్ని సరైన పరీక్షల సిబ్బంది, ఇతరత్రా ఏర్పాట్లతో సన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు. ప్రైవేటు ఆసుపత్రులు అలర్ట్‌గా ఉండాలి. వచ్చే కొద్ది రోజులలో వైరస్ సోకి ఆసుపత్రులలో చేరే వారి సంఖ్య పెరిగితే చేర్చుకునేందుకు మలాద్‌లోని జంబో హాస్పిటల్‌ను ప్రాధాన్యతాక్రమంలో విరివిగా వాడుకోవాలని నిర్ణయించారు. జన సాంద్రత ఎక్కువగా ఉండే ముంబైకి నిత్యం దూర ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చిపోతూ ఉంటారు. ఇటీవలి కాలంలో మాస్క్‌లు, భౌతికదూరాల పాటింపు తగ్గింది. ఈ దశలో తలెత్తిన వైరస్ పరిణామాలు అధికారులలో కలవరానికి దారితీశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News