యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘సాహో’ తర్వాత చేస్తున్న పీరియాడిక్ రొమాంటిక్ లవ్ స్టోరీ చిత్రంపై తెలుగు ప్రేక్షకుల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులకు ఆసక్తి ఉంది. రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ ఈ సినిమాను చేస్తున్నాడు. మొన్నటి వరకు ఈ సినిమాకు ‘జాన్’అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్లుగా ప్రచారం జరిగింది. కానీ ‘జాన్’ను వర్కింగ్ టైటిల్ అనుకున్నారు. ఇప్పుడు సినిమాకు కొత్త టైటిల్ను ప్రకటించబోతున్నారు ఫిల్మ్మేకర్స్. ఓ డియర్, రాధే శ్యామ్ అనే పేర్లు వినిపిస్తున్నాయి. వీటితో పాటు ఇంకా రెండు,మూడు పేర్లు కూడా అనుకుంటున్నారట. ప్రభాస్ చిత్రం ప్రారంభమై చాలా నెలలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు కనీసం ఫస్ట్ లుక్ కూడా విడుదల చేయక పోవడంపై అభిమానులు నిరుత్సాహంగా ఉన్నారు.
ఈ నేపథ్యంలో ఉగాదికి ప్రభాస్ ఫ్యాన్స్కు స్పెషల్ ట్రీట్ను సిద్ధం చేస్తున్నారు ఫిల్మ్మేకర్స్. మార్చి 25న ఉగాది సందర్భంగా ప్రభాస్ చిత్రం గురించి ఇన్ని రోజులు ప్రేక్షకుల్లో ఉన్న ప్రశ్నలు, మీడియాలో వస్తున్న పుకార్లన్నింటికీ సమాధానం లభించబోతోంది. ఆ రోజు సినిమా టైటిల్ను ప్రకటించడంతో పాటు ప్రభాస్ లుక్ను కూడా రిలీజ్ చేస్తారు. అదేవిధంగా చిన్న టీజర్ను కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం యూరప్లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఇటీవలే ఒక అద్భుతమైన చేజింగ్ సీన్ను హాలీవుడ్ టెక్నీషియన్స్తో చేశామంటూ దర్శకుడు రాధాకృష్ణ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఉగాది వరకు యూరప్లోనే షూటింగ్ జరిగే అవకాశం ఉందని సమాచారం.