Tuesday, April 30, 2024

నేడు రాష్ట్రానికి శీతాకాల అతిథి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం నేడు ( సోమవారం నాడు ) హైదరాబాద్‌కు రానున్నారు. సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి ముర్ము ఈ నెల 30వ తేదీ వరకు బస చేయనున్నారు. రాష్ట్రపతి రాకకు సంబంధించిన సమాచారాన్ని రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటన విడుదల చేసింది. ద్రౌపతి ముర్ము రాష్ట్రపతి అయ్యాక ఆమె రాష్ట్రపతి హోదాలో తొలిసారిగా తెలంగాణ రాష్ట్రానికి వస్తుండడం గమనార్హం. రాష్ట్రపతి శీతాకాల విడిది నేపథ్యంలో బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా రాష్ట్రపతి బస చేయనున్న రాష్ట్రపతి నిలయంలో 6 భవనాలు , దీని వెలుపల ఉన్న మరో 14 భవనాలను, వీటి చుట్టూ ఉన్న ప్రాంతాలను అలాగే ఉద్యాన వనాలను అందంగా తీర్చిదిద్దారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఢిల్లీ నుండి వచ్చిన ప్రత్యేక బృందం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం పరిసరాలను ఇప్పటికే తమ ఆధీనంలోకి తీసుకుంది.

రాష్ట్రపతి హోదాలో ఉన్న వ్యక్తులు వేసవి కాలంలో సిమ్లాకు, శీతాకాలం వస్తే హైదరాబాద్ పర్యటనకు రావడం ఆనవాయితీగా వస్తోంది. అయితే కరోనా కారణంగా గత రెండేళ్లుగా రాష్ట్రపతి హైదరాబాద్ లో శీతాకాల విడిదికి రాలేదు. కాగా రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లను సమీక్షించేందుకు రాష్ట్రప్రభుత్వం ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ గత వారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి ముర్ము హాజరయ్యే కార్యక్రమాల్లో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా జిల్లా అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆయన కోరారు. కాగా సోమవారం ఢిల్లీ నుండి హైదరాబాద్ లో ప్రత్యేక విమానంలో దిగిన వెంటనే ముర్ము బొల్లారం లోని రాష్టపతి నిలయం చేరుకుంటారు.
రాష్ట్రపతి షెడ్యూల్ ఇలా …
ఈ నెల 26న రాష్టానికి చేరుకుని కొద్ది సేపు బొల్లారంలో బస చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలోని శ్రీశైలానికి చేరుకుంటారు. అక్కడ భ్రమరాంబికామల్లికార్జున స్వామి ఆలయాలను రాష్ట్రపతి ముర్ము దర్శిస్తారు. ఈ నెల 27న కేశవ మెమోరియల్ ఎడ్యుకేషన్ సొసైటీ హైదరాబాద్ విద్యార్థులను, ఫ్యాకల్టీ సభ్యులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అదే రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమికు చేరుకుని 74వ ఆర్‌ఆర్ బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ ఆఫీసర్స్ ట్రైనీస్‌ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అదే రోజు మిశ్రుధాతు నిగం నిమిటెడ్‌లోను ప్లెట్ మిల్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ నెల 28న రాష్ట్రపతి భద్రాచలం లోని సీతారామ చంద్ర స్వామి ఆలయాన్ని సందర్శించి ఇక్కడ
ప్రసాద్ స్కీమ్ కార్యక్రమంలో భాగంగా పర్యాటక మౌళిక సదుపాయాలకు శంకుస్థాపనచేయనున్నారు. అదే రోజు సమ్మక్క సారలమ్మ జాంజాటి పూజారీ సమ్మేళనం కార్యక్రంలో పాల్గొంటారు. అదే రోజు ములుగు జిల్లాలోని ప్రసిద్ధ రామప్ప ఆలయాన్ని సందర్శిస్తారు. దీనిని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గత సంవత్సరమే గుర్తించింది. అదే రోజున రాష్ట్రపతి ముర్ము భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం ఆలయాన్ని సందర్శించి స్థానికంగా ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం
హైదరాబాద్‌కు చేరుకుని జి. నారాయణమ్మ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, బిఎం మలానీ నర్సింగ్ కాలేజీ కార్యక్రమంలో పాల్గొంటారు.

అదే రోజు ఆమె శంషాబాద్ సమీపంలోని శ్రీరాంనగరం వద్ద గల స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటి విగ్రహాన్ని సందర్శిస్తారు. కాగా రాష్ట్రపతి రాష్ట్ర పర్యటన, బొల్లారంలో బస చేయనున్న నేపథ్యంలో ఆమెకు విమానాశ్రయంలో స్వాగతం పలికేందుకు అలాగే బొల్లారంలోనూ భద్రతా పరమైన అన్ని చర్యలను అధికారులు చేపట్టారు. ఇప్పటికే రాష్ట్రపతి నిలయం పూర్తిగా ఢిల్లీ నుండి వచ్చిన ప్రత్యేక బృందం ఆధీనంలో ఉండడం గమనార్హం. కాగా రాష్ట్రపతి ముర్మును కలిసేందుకు ప్రజా సంఘాలు, రాజకీయ నాయకులు కలిసే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రం గురించి ఇక్కడి పర్యాటక ప్రాంతాల గురించి కూడా వివరిస్తారని అంటున్నారు.
రాష్ట్రపతి స్వాగతం పలకనున్నగవర్నర్, ముఖ్యమంత్రి
కాగా రాష్ట్రపతి హోదాలో రాష్ట్రపతి ముర్ము తొలి సారిగా తెలంగాణకు వస్తుండడంతో గవర్నర్ తమిళిసౌ సౌందర రాజన్, ముఖ్యమంత్రి కెసిఆర్‌లు స్వాగతం పలుకనున్నారు. ఇందుకోసం సర్వం ఏర్పాట్లు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News