Sunday, April 28, 2024

సీజనల్ వ్యాధుల కట్టడికి పకడ్బందీ చర్యలు

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లి: సీజనల్ వ్యాధుల కట్టడికి పకడ్భందీగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. సోమవారం సీజనల్ వ్యాధులపై కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ వర్షాకాలం నేపథ్యంలో దోమలు అధికం కావడం వల్ల పలు రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు.

జిల్లాలో దోమల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి ఆదివారం జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థల్లో ప్రత్యేక పారిశుద్య కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రభుత్వ హాస్టళ్లు, విద్యా సంస్థల్లో చదువుకునే విద్యార్థుల ఆరోగ్యంపై ప్రతి రోజు పర్యవేక్షించాలని తెలిపారు. అలాగే వార్డెన్ వారి ఆరోగ్య పరిస్థితిని ప్రతి రోజు ఇవ్వాలని ఆదేశించారు.

గత సంవత్సరం బేగంపేట, గద్దలపల్లి, గర్రెపల్లి, ముత్తారం, జూలపల్లి, రాఘవాపూర్ ప్రాంతాల్లో డెంగ్యూ కేసులు ఎక్కువయ్యాయని ఈ ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. మండల వారిగా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించి, సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ప్రజలను భాగస్వామ్యం చేస్తూ వ్యాధులపై అవగాహన కల్పించాలన్నారు.

రోజు వచ్చే కేసుల వివరాలను వాట్సప్ ద్వారా అందించాలని కలెక్టర్ సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో నీటి లీకేజీలు లేకుండా పంచాయతీ అధికారులు, సిబ్బంది చర్యలు చేపట్టాలన్నారు. సీజనల్ వ్యాధుల నివారణకు వైద్యశాఖ చేపట్టాల్సిన చర్యలను ప్రణాళికబద్దంగా చేయాలని, పంచాయతీ రాజ్, మున్సిపల్ అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తూ పని చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా వైద్యాధికారి ప్రమోద్ కుమార్, జిల్లా మలేరియా అధికారి రాజమౌళి, డీసీహెచ్‌ఎస్ శ్రీధర్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News