ఢిల్లీ కోర్టులో ఎంజె అక్బర్ వాదన
న్యూఢిల్లీ: తాను 20 సంవత్సరాల క్రితం లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపించిన జర్నలిస్టు ప్రియా రమణి తన ఆరోపణలను రుజువు చేయడంలో విఫలమయ్యారని మాజీ కేంద్ర మంత్రి ఎంజె అక్బర్ మంగళవారం ఢిల్లీ కోర్టుకు తెలిపారు. తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసి తనకు పరువునష్టం కలుగచేసినందుకు ప్రియా రమణిపై కేసు దాఖలు చేసిన అక్బర్ తన న్యాయవాది గీతా లూత్రా ద్వారా అదనపు ప్రధాన మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ రవీంద్ర కుమార్ ఎదుట తన వాదనలు వినిపించారు. 2018లో మీటూ ఉద్యమ కాలంలో అక్బర్పై రమణి లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు.
తన ఆరోపణలకు సంబంధించిన రుజువులను రమణి చూపించాలని, తాను నిజమేనని చెబుతున్నానని చెప్పినంతమాత్రాన సరిపోదని న్యాయవాది లూత్రా వాదించారు. ఎంజె అక్బర్ను తాను కలుసుకున్నట్లు ఆమె ఎటువంటి ఆధారాలు చూపించలేదని లూత్రా చెప్పారు. టెలిఫోన్ సంభాషనలు కాని, కార్ పార్కింగ్ రసీదు కాని, సిసిటివి ఫుటేజ్ కాని ఆమె చూపించలేకపోయారని లూత్రా చెప్పారు. రమణి ఆరోపణలు పచ్చి కల్పితాలని న్యాయవాది చెప్పారు. ఈ కేసు తదుపరి విచారణ ఈ నెల 14న జరగనున్నది.