Monday, May 6, 2024

కెసిఆర్ సిఎం కావడంతోనే అన్నిరంగాల్లో గుణాత్మకమైన మార్పులు

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డాక కెసిఆర్ సిఎం కావడంతోనే అన్నిరంగాల్లో గుణాత్మకమైన మార్పులు వచ్చాయని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సిపి శ్వేత ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సురక్ష దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. సిఎం కెసిఆర్ పోలీస్ శాఖ పెద్దపీట వేసి బలోపేతం చేయడంతోనే రాష్ట్రంలో శాఖ పరంగా ప్రజలకు ఉత్తమ సేవలు అందుతున్నాయన్నారు. రాష్ట్రం ఏర్పడక ముందు పోలీస్ శాఖను పట్టించుకునే నాథుడే ఉండేవాడు కాదన్నారు. రాష్ట్రం ఏర్పడ్డ దశాబ్ది కాలంలో పోలీస్ శాఖలో వచ్చిన గుణాత్మకమైన మార్పులు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు.

మన రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అందుతున్న సేవలను ఇతర రాష్ట్రాలలో సైతం చర్చించుకుంటున్నారన్నారు. దేశంలో మొత్తంలో ఉండే సిసి కెమెరాలు ఒక ఎత్తు అయితే మన తెలంగాణలో ఉండే సిసి కెమెరాలు ఒక ఎత్తు అన్నారు. సిసి కెమెరాల ఏర్పాటుతో పోలీసుల పనితనం మరింత సులువై నేరాలను ఛేదించడం ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే నక్సలైట్ రాజ్యం రావడంతో పాటు మత కల్లోలాలు ఏర్పడుతాయని సృష్టించిన అనుమానాలు, అపోహలను తెలంగాణ పోలీసులు పటా పంచలు చేసి శాంతి భద్రతలు ఉన్న రాష్ట్రంగా మార్చారని అన్నారు. పోలీస్ శాఖలో 33 శాతం మహిళలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కుతుందన్నారు.

పోలీస్ స్టేషన్‌లకు ప్రత్యేకంగా నిధులను కేటాయించి ఠాణాకు వచ్చే వారికి వివిధ సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పోలీస్‌శాఖలో కాలం చెల్లిన వాహనాలు ఉండడంతో పోలీసులు ఎంతో ఇబ్బందులకు గురయ్యేవారని సిఎం కెసిఆర్ ప్రత్యేక చొరవతో మంత్రులు తిరిగే వాహనాల తరహా అదునాతన వాహనాలను పోలీసు శాఖ కు కేటాయించడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల ఖాళీలను భర్తి చేయడంతోనే పనిభారం ఎంతో తగ్గిందన్నారు. సిద్దిపేటలో పోలీసులకు చేపట్టిన హెల్త్ ప్రోఫైల్ యావత్తు దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. టెక్నాలజీ పెంచడంలో మన రాష్ట్రం ఎంతో ముందు ఉందన్నారు.

పారదర్శకంగా , వేగంగా పాస్ పోర్టు ఇవ్వడంలో మన తెలంగాణ మందు వరుసలో ఉందన్నారు. ఈ సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఈ ఎనిమిది సంవత్సరాలుగా అవార్డులు ఇస్తుందన్నారు. అంతకు ముందు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పట్టణ పుర వీదుల గుండా వాహానాల ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఉత్తమ పోలీసులను మంత్రి చేతుల మీదుగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్, జడ్పీ చైర్‌పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, యాదవరెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, సిపి శ్వేత, ఎఫ్‌డిసి చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ కడవేర్గు మంజుల రాజనర్సు, అదనపు డిసిపి మహేందర్, ఎసిపిలు దేవారెడ్డి, రమేశ్, ఫణిందర్, చంద్రశేఖర్, సుభాష్, సిఐలు బిక్షపతి, రవికుమార్, బానుప్రకాశ్, శ్రీధర్‌రెడ్డి, రఘు, రాజశేఖర్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు కడవేర్గు రాజనర్సు, మారెడ్డి రవీందర్‌రెడ్డి, వేలేటి రాధాకృష్ణశర్మ, మచ్చ వేణుగోపాల్ రెడ్డి, జాప శ్రీకాంత్, పాల సాయిరాం, రాగుల సారయ్య, బుచ్చిరెడ్డి, నాగరాజురెడ్డి, మల్లికార్జున్ , తిరుమల్ రెడ్డి, నర్సింలు, శ్రీనివాస్ తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News