Saturday, May 11, 2024

నిర్మల్‌లో సిఎం కెసిఆర్ వరాల జల్లులు

- Advertisement -
- Advertisement -

నిర్మల్: నిర్మల్ జిల్లా వాసులకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీపి కబురు చెప్పారు. రూ. కొట్ల నిధులతో నిర్మించిన నూతన కలెక్టరేట్ సమూదాయ భవనం ప్రారంభానికి వచ్చిన సీఎం కేసీఆర్ నిర్మల్‌లో వరాల వర్షం కురిపించారు. ముందుగా నిర్మల్‌కు చేరుకున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన కలెక్టరేట్‌ను ప్రారంభించి, బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అలాగే నూతనంగా మంజూరైన మెడికల్ కళాశాలకు భూమి పూజ చేశారు.అనంతరం నిర్మల్ సభ ప్రాంగణానికి చేరుకున్న సీఎం కేసీఆర్ మాట్లాడారు. నిర్మల్ జిల్లాలో మొత్తం 396 గ్రామ పంచాయతీలు ఉన్నాయని ప్రతీ గ్రామ పంచాయతీని అభివృద్ది చేసేందుకు ఒక్కొ గ్రామ పంచాయతీకి రూ. 10 లక్షల నిధులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు.

అలాగే నిర్మల్ జిల్లాలో మూడు మున్సిపాలిటిలు నిర్మల్, ముథోల్, ఖానాపూర్ మున్సిలిటిలకు ఒక్కొ మున్సిపాలిటికి రూ. 25 కోట్లు మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే ప్రతీ మండలాభివృద్దికి రూ. 20 లక్షలు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. వెనుక బడిన ఆదిలాబాద్ జిల్లా నేడు వెలుగులతో, అభివృద్దితో కళాకళాడుతుందన్నారు.అప్పట్లో ఆదిలాబాద్ ప్రాంత వాసులు సరైన మంచినీరు లేక వివిధ రకాలైన అంటువ్యాధులతో ప్రాణాలు కోల్పోయే వారని, నేడు తెలంగాణ సాధించుకున్నా తరువాత మిషన్ భగీరథ పథకం అమలు చేసుకొని స్వచ్ఛమైన నీరును అందిస్తున్నామన్నారు. ధరణిని తొలగించాలని కొందరు మూర్కులు పట్టుపడుతున్నారని ధరణిని తొలగిస్తే మళ్లీ పాత ధరిద్రమే ముందుకొస్తుందన్నారు.

ధరణితో నేడు పది నిమిషాల్లో పట్టా అవుతుందని, అంతా ఆన్‌లైన్ అయి రైతుల ఖాతాలోనే నేరుగా డబ్బులు జమ అవుతున్నాయన్నారు. నేరుగా రైతు ఖాతాలో డబ్బులు జమ కావడంతో, రైతుబంధు, రైతు భీమా పథకాల అమలుతో పక్కన ఉన్న మహారాష్ట్ర వాసులు ఆశ్చర్యానికి గురవుతున్నారన్నారు. అలాగే నేడు తెలంగాణలో బోర్లు వేసుకుంటూ పక్కన ఉన్న మహారా్రష్ట్రకు నీళ్లు తరలించుకునే పరిస్థితి ఉందన్నారు. అలాగే రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి , స్థానిక నాయకుల కోరిక మేరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఒక ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

అలాగే ఇప్పటికే నిర్మల్‌లో అర్హులైన వారికి డబుల్ బెడ్ రూమ్‌లు మంజూరు చేశామని, ఇక ముందు సొంత జాగ ఉన్న వారికి గృహా లక్ష్మీ కింద రూ. 3 లక్షలు మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్నందున ప్రతిపక్ష నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని వచ్చే ఎన్నికల్లో వారికి ప్రజలే బుద్ది చెప్పాలన్నారు. అలాగే ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కోరిక మేరకు భైంసా మండలంలోని గుండెగావ్ గ్రామ రహదారి సమస్యను తీరుస్తామని హామీ ఇచ్చారు.

త్వరలోనే బాసరకు వస్తా: ఆధ్యాత్మిక భావనతో తెలంగాణలోనే అనేక దేవాలయాలను అభివృద్ది చేసుకుంటున్నామని, అందులో బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారికి దేవాలయాభివృద్దికి అనేక నిధులు మంజూరు చేశామని, శంకుస్థాపనకు త్వరలోనే బాసర అమ్మవారి క్షేత్రానికి రానున్నట్లు తెలిపారు. నిర్మల్ జిల్లాలో ఎలాంటి సమస్యలు లేకుండా సస్యశ్యామలంగా అభివృద్ది చెందుతుందని, నిర్మల్ జిల్లా అభివృద్దికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖశ్యాంనాయక్, ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కృషి అభినందనీయమన్నారు.
* విద్యాభివృద్దిలో నిర్మల్ ముందు ః విద్యాభివృద్దిలో రాష్ట్రంలోనే నిర్మల్ జిల్లా ముందంజ ఉండడం అభినందనీయమన్నారు. ఇటీవల విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో నిర్మల్ జిల్లా మొదటి స్థానంలో నిలువడం అభినందనీయమన్నారు. అందుకు ఉపాధ్యాయులను, స్థానిక నాయకులను సీఎం కేసీఆర్ అభినందించారు. ఇక మునుముందు కూడా నిర్మల్‌ను విద్యాభివృద్దిలో ముందుకు తీసుకెళ్లాలని కోరారు . ఈ కార్యక్రమంలో రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ,దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, రోడ్లు,

భవనాలు, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు విఠల్ రెడ్డి, రేఖశ్యాంనాయక్, జోగు రామన్న, రాథోడ్ బాపురావు, కోనేరు కోనప్ప, దివాకర్‌రావు, ఆత్రం సక్కు, దుర్గం చిన్నయ్య, ఎమ్మెల్సీ దండె విఠల్,ఎంపీ వెంకటేష్ నేత, నిర్మల్ , ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల్ జడ్పీ చైర్మన్‌లు, రాష్ట్ర ఇరిగేషన్ శాఖ చైర్మన్ సముద్రాల వేణుగోపాలచారీ, టిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News