Wednesday, May 8, 2024

అన్యాయం విద్వేషానికి దారి తీస్తోంది

- Advertisement -
- Advertisement -

నా యాత్రకు ‘న్యాయం’ చేర్చింది అందుకే
ఆర్థిక అంతరం, సాంఘిక అసమానత ఇంకా సమస్యలే
మధ్యప్రదేశ్ యాత్రలో రాహుల్ గాంధీ

గ్వాలియర్ : కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తాను ప్రస్తుతం సాగిస్తున్న యాత్రలో ‘న్యాయ్’ ప్రాముఖ్యం గురించి ఉద్ఘాటించారు. దేశంలో పెరుగుతున్న విద్వేషం అన్యాయాలకు దారి తీస్తోందని ఆయన ఆరోపించారు. మధ్య ప్రదేశ్ గ్వాలియర్ జిల్లాలోని మొహానాలో సభికులను ఉద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ఆర్థిక అంతరం, సాంఘిక అసమానత, రైతులు, యువజనుల పట్ల సరిగ్గా వ్యవహరించకపోవడం తన ప్రధాన ఆందోళనలుగా పేర్కొన్నారు. అయితే, భారతీయ జనతా పార్టీ (బిజెపి) అటువంటి ఆరోపణలు అన్నిటినీ తోసిపుచ్చింది.

తన ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ కోసం కొద్దిగా విరామం తీసుకున్న రాహుల్ వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి), పెద్ద నోట్ల చలామణీ రద్దు వంటి విధానాల దుష్ప్రభావాలపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఆ విధానాలు నిరుద్యోగిత రేట్ల పెరుగుదలకు కారణం అయ్యాయని ఆయన ఆరోపించారు. నిరుద్యోగిత రేట్లు 40 ఏళ్లలోనే అత్యధికంగా ఉన్నాయని రాహుల్ తెలిపారు. ‘జిఎస్‌టి, పెద్ద నోట్ల రద్దు తీవ్ర నిరుద్యోగానికి దారి తీశాయి’ అని ఆయన చెప్పారు. ‘నిరుద్యోగిత రేట గత 40 ఏళ్లలలోనే అత్యధికం’ అని ఆయన ఆరోపించారు.

భారత్‌లో యువతలో నిరుద్యోగిత రేటు పాకిస్తాన్ వంటి దేశాలలో కన్నా ఎక్కువగా ఉందని, ప్రభుత్వ విధానాల ప్రభావంతోనే ఆ పరిస్థితి నెలకొందని, చిన్న వాణిజ్య సంస్థలను ప్రభుత్వ విధానాలు దెబ్బ తీస్తున్నాయని రాహుల్ విమర్శించారు. తన రెండవ దశ యాత్రను ప్రారంభిస్తున్నప్పుడు ‘న్యాయ్’ పదాన్ని చేర్చానని ఆయన తెలిపారు. ఆర్థిక, సాంఘిక రంగాలలో అన్యాయం కారణంగాను, రైతులకు, యువతకు జరుగుతున్న అన్యాయం ఫలితంగాను దేశంలో విద్వేషం వ్యాపిస్తున్నదని రాహుల్ ఆరోపించారు.

సైనికులకు, ముఖ్యంగా అగ్నిపథ్ పథకంలో చేరినవారికి గుర్తింపు, ప్రయోజనాలు తగ్గిపోతుండడం పట్ల ఆయన అసంతృప్తి వెలిబుచ్చారు. అగ్నిపథ్ పథకంలో చేరినవారికి అత్యవసరమైన మద్దతు లభించడం లేదని ఆయన ఆరోపించారు. ఇప్పుడు (అగ్నిపథ్ పథకంలో భాగంగా సాయుధ దళాలలో పేర్లు నమోదు చేసుకున్న) అగ్నివీర్‌లకు దేశం కోసం తమ ప్రాణాలు త్యాగం చేస్తే అమరవీరుల హోదా దక్కదని, వారికి పింఛన్, క్యాంటీన్ సౌకర్యాలు కూడా లభించవని రాహుల్ చెప్పారు. ఒబిసిలు, ఆదివాసీలు, దళితులు వంటి జనాభాలో 73 శాతం బడుగు వర్గాల గురించి రాహుల్ ప్రస్తావిస్తూ, వారిని పాలన, వాణిజ్యఅవకాశాల నుంచి మినహాయించారని ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News