Saturday, May 4, 2024

పప్పు అని మరోసారి నిరూపించుకున్న రాహుల్: రెడ్కో చైర్మన్ వై. సతీష్ రెడ్డి ఎద్దేవా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి తాను పప్పు అని మరోసారి నిరూపించుకున్నారని తెలంగాణ రెడ్కో చైర్మన్ వై. సతీష్ రెడ్డి ఆదివారం నాడొక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేయాలని ఆత్రుత తప్ప ఆయన ప్రసంగంలో మరేం కనిపించలేదన్నారు. రూ. లక్ష కోట్లు కూడా ఖర్చు కాని కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని అన్నారంటేనే ఆయన ఎంత పెద్ద పప్పు సుద్దనో అర్థమైందన్నారు. అలాగే మిషన్ కాకతీయపై రాహుల్ గాంధీ విమర్శలు చేయడం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు.

60 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ నీటి వనరులను పరిరక్షించలేదని, తెలంగాణలో ఉన్న గొలుసు కట్టు చెరువులు కాంగ్రెస్ నేతల కబ్జాలకు బలయ్యాయన్నారు. కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణలో మిషన్ కాకతీయ ద్వారా చెరువులకు పునరుజ్జీవనం వచ్చిందని, ఎండాకాలంలో కూడా చెరువులు మత్తళ్లు దూకుతున్నాయన్నారు. వేలకోట్ల మధ్య విలువ చేసే మత్స్య సంపద చెరువుల్లో చెంగుచెంగున ఎగురుతోందన్నారు. ఇవేవీ తెలియకుండా మాట్లాడి పప్పు అనిపించుకున్నారని సతీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. అలాగే పోడు భూములపై రాహుల్ గాంధీ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.

ఆరు దశాబ్దాలు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ఏనాడు అడవి బిడ్డలను పట్టించుకున్న పాపాన పోలేదని, అడవి బిడ్డలు పట్టాలు కావాలని అడిగితే వారిని కాల్చి చంపిన దుర్మార్గ చరిత్ర కాంగ్రెస్‌దన్నారు. ఇప్పుడు తెలంగాణలో సిఎం కెసిఆర్ అడవి బిడ్డలకు పోడు పట్టాలు ఇచ్చి, రైతుబంధు, రైతుబీమా కూడా వర్తింపజేశారన్నారు. రెండు రోజుల క్రితమే జరిగిన ఈ కార్యక్రమం గురించి తెలియకుండా మాట్లాడి మళ్లీ పప్పు అనిపించుకున్నారన్నారు. దశాబ్దాలుగా వివక్షకు గురైన వర్గాలన్నీ నేడు తెలంగాణలో సుభిక్షంగా, సుఖ సంతోషాలతో జీవిస్తున్నాయని, దానికి కారణం బిఆర్‌ఎస్ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ ఫలాలేనన్నారు. తెలంగాణ సంక్షేమం గురించి కనీస అవగాహన లేకుండా రాష్ట్ర నాయకులు రాసి ఇచ్చిన స్క్రిప్ట్‌నే చదివి రాహుల్ గాంధీ తన అవివేకాన్ని ఆధ్యంతం పదే పదే బయటపెట్టుకున్నారని సతీష్ రెడ్డి విమర్శించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News