హైదరాబాద్: సూపర్స్టార్ రజనీకాంత్ ఆరోగ్యం శుక్రవారం కంటే మెరుగ్గా ఉందని అపోలో ఆసుపత్రి వెల్లడించింది. రజనీకాంత్కు శనివారం మరిన్ని వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు రజనీ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ను శనివారం విడుదల చేసింది. రజనీకాంత్ విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. రక్తపోటు హెచ్చుతగ్గులకు సంబంధించి వైద్యులు ఎప్పటికప్పుడు రజనీకాంత్ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారని పేర్కొంది. రక్తపోటు నియంత్రణలోకి వచ్చాక డిశ్చార్జి విషయాన్ని వెల్లడిస్తామని తెలిపింది. రజనీకాంత్ను చూసేందుకు సందర్శకులెవరికీ అనుమతి లేదని అపోలో ఆసుపత్రి సూచించింది. ఆయన ఆరోగ్యంపై తెలుగు రాష్ట్రాలలో సహా చెన్నైలోనూ ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు సూపర్స్టార్ ఆరోగ్యపరిస్థితిని వెల్లడిస్తున్నామని అపోలో ఆసుపత్రి సిఎండి సంగీతారెడ్డి తెలిపారు. రజనీ ఆరోగ్యంపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆయన బాగానే ఉన్నారని సంగీతారెడ్డి స్పష్టం చేశారు.
వదంతలు తగదు…
సూపర్స్టార్ రజనీకాంత్ ఆరోగ్యం విషయంలో సామాజిక మాధ్యమాల్లో ఎవరూ వదంతులు సృష్టించవద్దని రజనీ తెలంగాణ అభిమాన సంఘం అధ్యక్షుడు శ్రీకాంత్ దేచపల్లి విజ్ఞప్తి చేశారు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని, డిసెంబర్ 31న నూతన పార్టీపై ప్రకటన చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. రజనీ అస్వస్థతకు గురయ్యారని తెలుసుకున్న శ్రీకాంత్.. శుక్రవారం నుంచి హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రి వద్ద ఉంటూ అభిమానులకు సమాచారాన్ని చేరవేస్తున్నారు. కొన్ని సామాజిక మాధ్యమాల్లో అవాస్తవాలు ప్రసారం చేస్తున్నారని, వాటన్నింటినీ వెంటనే తొలగించాలని కోరారు. అధిక రక్తపోటుతో అస్వస్థతకు గురైన రజనీ.. శుక్రవారం అపోలోలో చేరారు.
Rajinikanth medical health bulletin