Friday, April 26, 2024

నిమ్స్‌లో చిన్నారులకు అరుదైన గుండె సర్జరీలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : నిమ్స్ హాస్పిటల్‌లో గత నాలుగు రోజులుగా చిన్నారులకు అరుదైన గుండె సర్జరీలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు 8 సర్జరీలు పూర్తయ్యాయి.రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ప్రత్యేక ఆహ్వానం మేరకు బ్రిటన్ నుంచి డాక్టర్ వెంకట రమణ దన్నపునేని నేతృత్వంలోని ఆరుగురు వైద్యుల బృందం నిమ్స్ వైద్యులు, నీలోఫర్ హాస్పిటల్ డాక్టర్లు పరస్పర సహకారంలో ఈ సర్జరీలు నిర్వహించారు. చిన్నారులకు గుండె సర్జరీలు చేయడం ఎంతో క్లిష్టమైనది, ఖరీదైనది. ప్రైవేటులో దాదాపు రూ.5 లక్షల వరకు ఖర్చయ్యే ఈ శస్త్ర చికిత్సలను పేద చిన్నారులకు ఉచితంగా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన. తాజాగా నెల రోజుల వయసున్న శిశువుకు సర్జరీనీ విజయవంతంగా నిర్వహించారు.

మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్‌కు చెందిన నెల రోజుల వయసున్న శిశువు (తల్లి ఫాతిమా) ఇటీవల తీవ్ర హృద్రోగ సమస్యలతో నిమ్స్ ఆసుపత్రిలో చేరారు. అప్పటికి శిశువు బరువు కేవలం 2.5 కిలోలు. ఆర్టీరియల్ అనాటమీ, మల్టిపుల్ వెంట్రిక్యులార్ సెప్టల్ డిఫెకట్స్‌తో హాస్పిటల్‌లో చేరిన చిన్నారికి బ్రిటన్ వైద్యులు, నిమ్స్ వైద్యులు, నీలోఫర్ డాక్టర్లు కలిసి ఒక బృందంగా ఏర్పడి మూడు రోజుల క్రితం(ఫిబ్రవరి 28) శిశువుకు ఆర్టీరియల్ స్విచ్ రిపేయిర్, మల్టిపుల్ విఎస్‌డి క్లోజర్ సర్జరీలు విజయవంతంగా నిర్వహించారు. ప్రభుత్వ దవాఖానలో ఇలాంటి సర్జరీ జరగడం రాష్ట్రంలోనే మొదటిసారి. ప్రస్తుతం శిశువు ఐసియులో ఉన్నారు. శస్త్రచికిత్స అనంతరం క్రమంగా కోలుకుంటున్నది.
మంత్రి హరీశ్ రావు అభినందనలు
అరుదైన సర్జరీ చేసి శిశువు ప్రాణం కాపాడిన నిమ్స్ వైద్యులను ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అభినందించారు. బ్రిటన్ నుంచి ప్రత్యేక వైద్య బృందం వచ్చి నిమ్స్‌లో చిన్నారులకు చేసే సర్జరీల్లో పాల్గొనడం, సహకారం అందించడం గొప్ప విషయమని అన్నారు. శిశువు త్వరలోనే పూర్తిగా కోలుకొని తల్లి ఒడికి చేరాలని కోరుకుంటున్నానని మంత్రి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News