నాలా కన్వర్షన్ చేయకపోయినా లే ఔట్లు, ధరణిలో పట్టాదారుల పేర్లు నమోదు, ప్లాట్ల్లు కొన్న వారికి తప్పని చిక్కులు, రానున్న రోజుల్లో చిక్కుముళ్లకు పరిష్కారం చూపనున్న ధరణి.
హైదరాబాద్ : పన్ను చెల్లింపుల ఆధారంగా వ్యవసాయేతర భూముల్లో కట్టిన ఇండ్లు, ప్లాట్ల వివరాలను ‘ధరణి’ పోర్టల్ లో నమోదు చేస్తున్నారు. తాజాగా సిఎం కెసిఆర్ ప్రకటనతో సరికొత్త పాలనను రాష్ట్రం అందించబోతోంది. అయితే కేవలం 15 రోజుల్లోనే దీన్ని పూర్తి చేయాలంటూ పంచాయతీ రాజ్, మున్సిపల్, కార్పొరేషన్ అధికారులు, ప్రజాప్రతినిధులను ఆదేశించారు. ఈ పంచాయతీలో ఉన్న డేటాను న్యాప్ యాప్లోకి బదిలీ చేస్తున్నారు. ఇప్పుడు ‘ధరణి’లో నమోదు చేసేది డేటా మాత్రమేనని, హక్కులు కల్పించడం కాదని, అందులో నమోదు చేయనంత మాత్రాన హక్కులు ఎక్కడికీ పోవని అదికారులు పేర్కొంటున్నారు.
సబ్ రిజిస్ట్రార్ల దగ్గర ఓపెన్ ప్లాట్ల వివరాలు
కేవలం సబ్ రిజిస్ట్రార్ దగ్గర మాత్రమే ఓపెన్ ప్లాట్లకు సంబంధించిన వివరాలు ఉంటాయి. కేవలం సేల్ డీడ్ కు మాత్రమే సబ్ రిజిస్ట్రార్ సాక్షి. అందుకే ఒకే భూమిని ఎన్నిసార్లు లే ఔట్ చేసినా ఆ ప్లాట్లను రిజిస్ట్రేషన్లు చేశారు. ఎన్నిసార్లు లే ఔట్లను మార్చినా గుర్తించే వ్యవస్థ రిజిస్ట్రేషన్ల శాఖలో లేదు. అందుకే హైదరాబాద్ నగర శివార్లలో అనేక భూములకు హక్కుదార్లు ఇద్దరు, ముగ్గురు ఉన్నారు.
ఒక్క భూమి రెండుసార్లు లే ఔట్లు
రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, యాదాద్రి, నల్లగొండ జిల్లాల్లో అనేక గ్రామాల్లో ఒక్కటే భూమిని రెండు, మూడేసి సార్లు లే ఔట్ చేసి విక్రయించారు. నాలా కన్వర్షన్ చేయకపోయినా ఆ లే ఔట్లలో ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేశారు. సేల్ డీడ్ ఆధారంగా ‘ధరణి’లో వీటి వివరాలను నమోదు చేస్తే ప్రస్తుతం ఎవరికీ హక్కులు కల్పిస్తారన్న దానిపై సందిగ్ధత నెలకొంది. హెచ్ఎండీఏ లే ఔట్లు వేసిన ప్రాంతాల్లోని సర్వే నంబర్లలోనూ అంతకు ముందే పంచాయతీ లే ఔట్లుగా విక్రయించారు. చాలా లే ఔట్లలో నాలా కన్వర్షన్ కాకపోవడంతో రెవెన్యూ రికార్డుల్లో పట్టాదార్ల పేర్లే వస్తున్నాయి. వాటిని యథాతథంగా ధరణిలో నమోదు చేశారు. దాంతో వారికి రైతుబంధు పథకం కింద రూ.లక్షలు వస్తున్నాయి.
పంచాయతీ, మున్సిపల్, కార్పొరేషన్ పరిధిలో..
సదరు ప్లాట్ల యజమానులు వారి దగ్గరున్న సేల్ డీడ్లతో రెవెన్యూ అధికారులను సంప్రదించినా పట్టించుకోవడం లేదు. వందలాది మంది మధ్య తరగతి వర్గాలు ఈ ప్లాట్లను కొనుగోలు చేశారు. అలాంటి వారి ఆస్తుల నమోదులో పాత యజమానుల పేర్లే ‘ధరణి’లోకి ఎక్కే అవకాశం ఉంది. కానీ ఓపెన్ ప్లాట్లు, నాలా కన్వర్షన్ కట్టకుండానే చేసిన లే ఔట్ల యజమానులకు చిక్కులు తప్పవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఓపెన్ ప్లాట్ల వివరాలేవీ పంచాయతీ, మున్సిపల్, కార్పొరేషన్ పరిధిలో లేవు. వాటిని ‘ధరణి’ పోర్టల్ లో ఏ ప్రాతిపదికన తీసుకుంటారన్న విషయం తెలియాల్సి ఉంది.
స్వమిత్వతో మ్యాపింగ్
కేంద్రం ప్రభుత్వం దేశ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంత వ్యవసాయేతర ఆస్తులకు స్వమిత్వ(సర్వే ఆఫ్ విలేజెస్ విత్ ఇంప్రూవ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్) ప్రాజెక్టు కింద మ్యాపింగ్ చేసే ప్రక్రియను చేపట్టింది. కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ, రాష్ట్ర పంచాయత్, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో సర్వే చేస్తోంది. ఈ ఏడాది హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో పథకాన్ని అమలు చేస్తున్నారు. దశల వారీగా మిగతా రాష్ట్రాల్లోనూ నిర్వహించనున్నారు. దీని లక్ష్యం గ్రామీణ భారతంలో సమగ్ర ఆస్తుల విలువకు పరిష్కారం కల్పించడమే.
ప్రతి ల్యాండ్ పార్శిల్ కు డ్రోన్ టెక్నాలజీ, కంటిన్యూస్లీ ఆపరేటింగ్ రెఫరెన్స్ స్టేషన్ (సీఓఆర్ఎస్) విధానాలతో మ్యాపింగ్ చేస్తారు. 2020 నుంచి 2024 వరకు దేశ వ్యాప్తంగా దశల వారీగా ఈ మ్యాపింగ్ కార్యక్రమాన్ని పూర్తి చేయనున్నారు. స్వమిత్వ వల్ల హక్కుదారులకు హక్కులకు పూర్తి గ్యారంటీ దక్కుతుందని రెవెన్యూ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ మ్యాపులతో గ్రామ పంచాయత్ డెవలప్మెంట్ ప్లాన్స్(జిపిడిపి) ను పక్కాగా అమలు చేయవచ్చని వారు పేర్కొంటున్నారు.
నెల రోజులుగా ‘ధరణి’ పోర్టల్పై చర్చ
నెల రోజులుగా రాష్ట్రంలో ‘ధరణి’ పోర్టల్ చుట్టూ చర్చ జరుగుతోంది. ప్రస్తుతం సిఎం కెసిఆర్ వ్యవసాయేతర భూములనూ కంప్యూటరీకరించాలన్న సంకల్పంతో ఉన్నారు. సాగు భూములకు హక్కులను నిర్ధారించడా నికి సర్వే సెటిల్మెంట్ రికార్డులు, మ్యూటేషన్ల రికార్డులతో రూపొందించిన ఆర్వోఆర్ రికార్డు 1-బి వంటివి ఉన్నాయి. భూములు చేతులు మారినప్పుడల్లా తయారయ్యే రికార్డులన్నీ రెవెన్యూ కార్యాలయాల్లో ఉం టాయి. సాగు భూములకు వందేండ్ల రికార్డు కూడా దొరుకుతుంది. వాటి ఆధారంగా రూపొందించిన ‘ధరణి’తో రానున్న రోజుల్లో చిక్కుముళ్లు వీడే అవకాశం ఉందని రెవెన్యూ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.
Registration of assets based on tax payments