Monday, April 29, 2024

ఖతర్‌లో భారత మాజీ నేవీ అధికారులకు ఊరట

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: గూఢచర్యం ఆరోపణలకు సంబంధించిన కేసులో భారత్‌కు చెందిన ఎనిమిది మంది నౌకాదళ మాజీ అధికారులకు ఖతర్‌లో మరణ శిక్ష విధించిన విషయం తెలిసిందే. కాగా ఈ కేసులో గురువారం ఖతర్ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. మరణ శిక్షను రద్దు చేస్తూ వారికి ఊరట కల్పించింది. వారికి శిక్షను తగ్గించి జైలుశిక్ష విధిస్తున్నట్లు తెలిపింది.ఈ మేరకు ఖతర్ కోర్టు తీర్పును భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. అయితే వారికి ఎన్నేళ్ల శిక్ష విధించారనే దానిపై స్పష్టత రాలేదు. తీర్పునకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియరాలేదని, దీనిపై ఖతర్ అధికారులతో సంప్రదిస్తున్నామని భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఈ రోజు ఖతర్ కోర్టులో నిందితుల కుటుంబ సభ్యులతో పాటుగా ఖతర్‌లో మన రాయబారి కూడా ఉన్నారని విదేశాంగ శాఖ ఆ ప్రకటనలో తెలిపింది.ఈ కేసులో తదుపరి చర్యలు చేపట్టేందుకు న్యాయబృందంతోను చర్చలు జరుపుతున్నట్లు తెలిపింది. కాగా ఖతర్‌లోని ప్రైవేటు కంపెనీ దహ్రా గ్లోబల్ లో పని చేస్తున్న భారత నేవీ మాజీ కమాండర్లు పూర్ణేందు తివారీ,

సుగుణాకర్ పాకాల, అమిత్ నాగ్‌పాల్, సంజీవ్ గుప్తా, మాజీ నేవీ కెప్టెన్లు నవతేజ్ సింగ్ గిల్, బీరేంద్ర కుమార్ వర్మ,సౌరభ్ వశిష్ట్, మాజీ సెయిలర్ రాకేశ్ గోపకుమార్‌లను 2022లో అరెస్టు చేశారు. ఇజ్రాయెల్ తరఫున గూఢచర్యం చేస్తున్నట్లు ఆరోపణలు రావడంతో ఖతర్ కోర్టు ఈ ఏడాది అక్టోబర్‌లో వీరికి మరణ శిక్ష విధించింది. మరో వైపు భారత ప్రభుత్వం దీనిపై స్పందించింది. ఖతర్ ప్రభుత్వ యంత్రాంగంతో చర్చలు జరిపింది. భారత విదేశాంగ వాఖ దోహా కోర్టులో అపీలు దాఖలు చేసింది.భారతీయ మాజీ నేవీ అధికారులకు దౌత్యసంప్రదింపులతో పాటుగా అవసరమైన న్యాయ సహాయాన్ని అందించింది.దుబాయి అలాగే ఇటీవల దుబాయిలో జరిగిన కాప్28శిఖరాగ్ర సమావేశంలో ఖతర్ పాలకుడు షేక్ తమీమ్ బిన్ హమద్ అల్‌థానిని ప్రధాని మోడీ కలిశారు.ఈ అంశంపై మాట్లాడారు. ఈ నేపథ్యంలో భారత మాజీ నేవీ అధికారులకు విధించిన మరణ శిక్షఅపీల్‌పై ఖతర్ కోర్టు విచారణ జరిపింది.మరణ శిక్షను తగ్గించి జైలు శిక్షగా మార్పు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News