న్యూఢిల్లీ : రిటైడ్డ్ ఎంఇఎ (విదేశీ వ్యవహారాలు ) అధికారి 94 ఏళ్ల బి ఆర్ చావ్లా ఇంటిలో శనివారం రాత్రి దోపిడీ జరిగింది. దోపిడీని అడ్డుకోడానికి చావ్లా దంపతులు ప్రయత్నించగా, కత్తిపోట్లకు చావ్లా భార్యకాంతా చావ్లా (88) మృతి చెందింది. వాయువ్య ఢిల్లీ సఫ్దర్జంగ్ ఎన్క్లేవ్లో చావ్లా దంపతులు వారి ఇద్దరు పిల్లలు చనిపోయిన తరువాత ఒంటరిగా ఉంటున్నారు. ఆ ఎన్క్లేవ్కు ఇటీవలనే నియామకమైన సెక్యూరిటీ గార్డు తన ముగ్గురు అనుచరులతో కలసి వచ్చి చావ్లా ఇంట్లోకి చొరబడ్డాడు. వారిని బలవంతంగా సోఫాలో కూర్చుండబెట్టాడు. ఆ సమయంలో వారి దోపిడీని అడ్డుకున్న కాంతా చావ్లాను దుండగుల్లో ఒకడు కత్తితో పొడవడంతో ఆమె తీవ్ర గాయాలతో స్పృహ తప్పింది. ఆ తరువాత దుండగులు బెడ్రూమ్ లో చొరబడి నగదు, నగలు దోచుకుని పరారయ్యారని పోలీసులు తెలిపారు. దుండగులను పట్టుకోడానికి పోలీస్ బృందాలు ప్రయత్నిస్తున్నాయి.