Saturday, May 4, 2024

సిఎం కెసిఆర్‌కు రేవంత్ లేఖ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : సిఎం కెసిఆర్‌కు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఎనిమిదేళ్ల బిఆర్‌ఎస్ పాలనలో నిరుద్యోగులకు తీవ్ర నిరాశ మిగిలిందని ఆరోపించారు. పోలీసు విభాగంలో ఎస్‌ఐ, కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం ఆగస్టులో ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించారని, కొలువులు వస్తాయని ఆశించిన యువతకు ఈ పరీక్ష తీవ్ర ఆవేదనను మిగిల్చిందన్నారు. ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణ విధానంలో కొలువుల భర్తీలో బిఆర్‌ఎస్ ప్రభుత్వ చిత్తశుద్ధి ఎంతో తెలుస్తోందన్నారు. ప్రిలిమినరీ రాత పరీక్షలో పోలీస్ కానిస్టేబుల్, ఎస్‌ఐ రెండు ప్రశ్నపత్రాల్లో చెరో 7 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు సంబంధించి అభ్యర్థుల్లో గందరగోళం నెలకొందన్నారు. ఈ 7 ప్రశ్నలకు ఒకటి కంటే ఎక్కువ సమాధానాలు ఉన్నాయని అభ్యర్థులు అంటున్నారన్నారు. ఈ ప్రశ్నలకు సంబంధించి కొందరికి మార్కులిచ్చారని ఆరోపించారు. అసలు సమాధానం ఇవ్వని వారికి సైతం మార్కులు కేటాయించారన్నారు. కానీ కొందరు అభ్యర్థులకు మాత్రం మార్కులు ఇవ్వలేదని తెలిపారు.
ఈ విషయాన్ని అభ్యర్థులు తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు దృష్టికి తీసుకువెళ్లారని గుర్తుచేశారు. అయినా ఎటువంటి స్పందన లేకుండానే మెరిట్ జాబితాను రూపొందించి ఫిజికల్ టెస్టులు నిర్వహిస్తున్నారన్నారు. దీనిపై హైకోర్టు డిసెంబర్ 9న తీర్పునిచ్చిందని గుర్తుచేశారు. అభ్యర్థులు పేర్కొన్న 7 ప్రశ్నలను తొలగించాలని హైకోర్టు ఆదేశించిందన్నారు. ఆ మేరకు అర్హత సాధించిన వారికి ఫిజికల్ ఈవెంట్లలో పాల్గొనే అవకాశమివ్వాలని కోరారు. హైకోర్టు తీర్పును అమలు చేస్తే దాదాపు 50-60 వేల మంది అభ్యర్థులకు ఫిజికల్ టెస్టులకు హాజరయ్యే అవకాశం లభిస్తుందన్నారు. అభ్యర్థులు తమ ఆవేదనను ట్విట్టర్ లో కెటిఆర్, డిజిపిలకు విన్నవించుకున్నా సమాధానం రాలేదని ఆరోపించారు. సంబంధిత శాఖను చూసే హోం మంత్రి ఉన్నారా లేరో కూడా తెలియదని ఎద్దేవా చేశారు. హైకోర్టు ఆదేశించిన ప్రిలిమినరీ పరీక్షలోని 7 ప్రశ్నలను తొలగించి అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News