కరోనా కారణంగా ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ అస్తవ్యస్తమైపోయింది. ఇక సినీ రంగంలోనైతే అల్లకల్లోలమైపోతోంది. ఎక్కడి షూటింగ్స్ అక్కడే నిలిపివేసి ప్యాకప్ చెప్పేశారు ఫిల్మ్మేకర్స్. ఇకపోతే టాలీవుడ్ ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’కి కరోనా గట్టి దెబ్బ కొట్టింది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ పీరియాడికల్ మూవీలో ఎక్కువ మంది విదేశీ నటీనటులు నటిస్తున్న సంగతి తెలిసిందే. విదేశీయుల వీసాలను కరోనా కారణంగా కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా రద్దు చేసింది. దీంతో ఈ సినిమా షూటింగ్ ఇప్పట్లో ముందుకు నడిచే అవకాశమే లేదు.
ఈ ఏడాది జూలై 30న విడుదల కావల్సిన ఈ సినిమా రిలీజ్ డేట్ని వచ్చే ఏడాది సంక్రాంతికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా ‘ఆర్ఆర్ఆర్’ షెడ్యూల్పై అనూహ్యంగా వేటు పడింది. ఈ వేటును ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ ఎలా పూడ్చుకుంటుందో చూడాలి. ఈ నేపథ్యంలో దర్శక ధీరుడు రాజమౌళి కరోనా వైరస్పై స్పందించారు. “ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. స్వచ్ఛందంగా జాగ్రత్తలు పాటిస్తే మంచిది”అని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్రంలో స్కూళ్లు, కాలేజీలు, థియేటర్లు, పార్కులు మూసి వేసిన సంగతి తెలిసిందే.