Saturday, April 27, 2024

ఇఎస్‌ఐ స్కాంలో రూ.144 కోట్ల ఆస్తుల జప్తు

- Advertisement -
- Advertisement -

Rs 144 crore ED attached in ESI scam

మాజీ డైరెక్టర్ దేవీకారాణికి చెందిన రూ.17కోట్ల 26లక్షల విలువైన వాటితో పాటు పలువురి ఆస్తులు అటాచ్ చేసిన ఇడి

మనతెలంగాణ/హైదరాబాద్ : ఇఎస్‌ఐ మందుల కుంభకోణంలో కీలకపాత్ర వహించిన ఐదుగురు నిందితులకు సంబంధించిన రూ.144 కోట్ల ఆస్తులను ఇడి అధికారులు మంగళవారం నాడు అటాచ్ చేశారు. ఈక్రమంలో ఇఎస్‌ఐ మాజీ డైరెక్టర్ డాక్టర్ దేవికారాణి, మాజీ జెడి పద్మ, ఫార్మసిస్టు నాగలక్ష్మి, ఓమ్ని గ్రూపు డైరెక్టర్ కె.శ్రీహరిబాబు, పందిరి రాజేశ్వర్‌రెడ్డి ఆస్తులను జప్తు చేసింది. ఇందులో మాజీ డైరెక్టర్ దేవికారాణికి చెందిన రూ. 17 కోట్ల 26 లక్షల విలువైన ఆస్తులు, నాగలక్ష్మికి చెందిన రూ.2 కోట్ల 45 లక్షల ఆస్తులు, 74 లక్షల 8వేల విలువైన పద్మ ఆస్తులను ఇడి అటాచ్ చేసింది. ఓమ్ని గ్రూపు డైరెక్టర్ కె.శ్రీహరిబాబుకు చెందిన రూ.119 కోట్ల 89 లక్షలు, పందిరి రాజేశ్వర్‌రెడ్డికి చెందిన రూ.4 కోట్ల 7 లక్షల విలువైన ఆస్తులను తాత్కాలిక జప్తు చేసింది.

ఇదిలావుండగా ఈ కుంభకోణానికి సంబంధించి ఎసిబి అధికారులు ఎనిమిది కేసులు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో ఇఎస్‌ఐ అధికారులు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంగించి కాంట్రాక్టర్లతో కుమ్మక్కై సుమారు రూ.211 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడినట్లు తేల్చారు. నిర్ణిత ధర కన్నా నాలుగైదింతలు ఎక్కువకు కొనుగోలు జరిపి కమీషన్లతో పాటు లాభాల రూపంలో భారీగా నగలు, ఆస్తులు కూడగట్టినట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో దేవికారాణి, నాగలక్ష్మిపిఎంజె జ్యూవెలర్స్ నుంచి సరైన రశీదులు లేకుండా రూ.6 కోట్ల 28 లక్షల విలువైన నగలు కొనుగోలు చేసినట్లు ఎసిబి అభియోగం నమోదు చేసిన విషయం విదితమే.

మనీలాండరింగ్ కింద దర్యాప్తు 

ఇఎస్‌ఐ స్కాంలో మనీలాండరింగ్ జరిగినట్లు లభించిన ఆధారాలతో మనీలాండరింగ్ చట్టం కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తోంది. గతంలో నిందితులతో పాటు అప్పటి కార్మిక శాఖ మంత్రి నాయని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాసరెడ్డి, పీఎస్ ముకుంద రెడ్డి ఇళ్లల్లోనూ సోదాలు చేసి దాదాపు కోటిన్నర రూపాయలు స్వాధీనం చేసుకుంది. దర్యాప్తు ఇంకా కొనసాగుతున్న క్రమంలో నిందితులందరూ బెయిల్‌పై విడుదలైనందున ఆస్తులను అమ్మే అవకాశం ఉందని అందువల్లే ఆయా ఆస్తులను తాత్కాలిక జప్తు చేసినట్లు ఇడి వెల్లడించింది. మందుల కొనుగోళ్లలో 2015 నుంచి 2019 వరకు దాదాపు రూ. 200 కోట్ల రూపాయల అక్రమాలు జరిగినట్లు ఇడి దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసులోని నిందితులు కూడబెట్టుకున్న అక్రమాస్తుల్లో ఇప్పటి వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బెంగళూరు, నోయిడాలో 131 స్థిరాస్తులను గుర్తించినట్లు తెలిపింది. వాటిలో 97 ప్లాట్లు, ఆరు విల్లాలు, 18 వాణిజ్య సముదాయాలు, ఆరు వ్యవసాయ భూములు, 4 ఫ్లాట్లు ఉన్నాయని ఇడి పేర్కొంది. సెక్యూరిటీలు, ఫిక్స్‌డ్ డిపాజిట్ల వంటి చరాస్తులూ ఉన్నాయని, ఈ కేసులో మరికొందరు అనుమానితుల మనీలాండరింగ్ ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతోందని ఇడి అధికారులు వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News