Saturday, April 27, 2024

టెస్టు సమరానికి భారత్ రెడీ!

- Advertisement -
- Advertisement -

Team India cricketers practice for Test series against New Zealand

ముంబై: న్యూజిలాండ్‌తో జరిగే టెస్టు సిరీస్ కోసం టీమిండియా క్రికెటర్లు ముమ్మర సాధన చేస్తున్నారు. ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరుగనున్న విషయం తెలిసిందే. గురువారం నుంచి ముంబై వేదికగా తొలి టెస్టు మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం కొన్ని రోజులుగా భారత క్రికెటర్లు ముమ్మర సాధన చేస్తున్నారు. ఇక ట్వంటీ20 సిరీస్ ముగియడంతో మిగిలిన క్రికెటర్లు కూడా ముంబై చేరుకున్నారు. ఇక తొలి టెస్టు మ్యాచ్‌కు అజింక్య రహానె సారథ్యం వహిస్తున్నాడు. విరాట్ కోహ్లి మొదటి మ్యాచ్‌కు అందుబాటులో లేకుండా పోయాడు. దీంతో ఈ మ్యాచ్‌కు రహానె సారథ్యం వహిస్తున్నాడు. మరోవైపు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో టీమిండియా సమతూకంగా ఉంది. రహానె, పుజారా, రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా, శ్రేయస్ అయ్యర్, మయాంక్ అగర్వాల్, సూర్యకుమార్ యాదవ్ తదితరులతో భారత్ బ్యాటింగ్ చాలా బలంగా ఉంది.

అయితే ఫామ్‌లో ఉన్న కెఎల్.రాహుల్ టెస్టు సిరీస్‌కు దూరం కావడం టీమిండియాకు కాస్త ఆందోళన కలిగించే అంశంగా చెప్పొచ్చు. అయితే రాహుల్ లేకున్నా మయాంక్, గిల్, శ్రీకర్ భరత్‌లతో బ్యాటింగ్ పటిష్టంగానే ఉంది. అంతేగాక రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ వంటి ఆల్‌రౌండర్లు ఉండనే ఉన్నారు. మరోవైపు ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, అశ్విన్, జడేజా వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు జట్టుకు అందుబాటులో ఉన్నారు. వీరితో పాటు యువ బౌలర్లు జయంత్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, సిరాజ్ కూడా సత్తా చాటాలనే పట్టుదలతో కనిపిస్తున్నారు. కోహ్లి లేకున్నా భారత్ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఇక రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్న మొదటి టెస్టు సిరీస్ కావడంతో దీనికి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. రహానె కెప్టెన్సీకి కూడా సిరీస్ సవాల్‌గా మారింది. ఒకవేళ అతను టీమిండియాను విజయపథంలో నడిపిస్తే రానున్న రోజుల్లో రహానెను టెస్టు సారథిగా ఎంపికైనా ఆశ్చర్యం లేదు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News