Sunday, April 28, 2024

ఎపిలో ఆర్‌టిసి బస్సు ప్రమాదం

- Advertisement -
- Advertisement -

RTC bus accident in AP: 9 killed

9 మంది దుర్మరణం
మరి 9మందికి తీవ్రగాయాలు
వంతెన పైనుంచి వాగులో పడిన బస్సు

మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలోని జల్లేరు వద్ద బుధవారం ఆర్‌టిసి బస్సు వంతెనపై నుంచి వాగులో పడిన ప్రమాదంలో 9మంది మృతి చెందగా, మరో 9మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఈక్రమంలో ప్రమాదం నుంచి బస్సులో మిగిలిన 22 మంది ప్రయాణీకులు క్షేమంగా బయపడ్డారు. వివరాల్లోకి వెళితే… వేలేరుపాడు నుంచి జంగారెడ్డిగూడెం వెళ్తు న్న ఆర్‌టిసి బస్సు జల్లేరు వంతెన రెయిలింగ్‌ను బలంగా ఢీకొంది. దీంతో బస్సు ఒక్కసారిగా 25 అడుగులు లోతుగా ఉన్న వాగులో పడి ప్రమాదం చోటుచేసుకుంది. వాగులో పడ్డ జంగారెడ్డిగూడెం డిపోకు చెందిన బస్సులో ప్రయాణిస్తున్న 40 మందిలో 8 మంది ప్రయాణీకులతో పాటు బస్సు డ్రైవర్ చిన్నారావు మృతి చెందాడు. మృతు ల్లో ఐదుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులున్నట్లు ప్రత్యక్ష సాక్షలు వివరించారు. ఒక్కసారిగా బస్సు నీటిలో పడటంతో బయటికి రాలేక ప్రయాణీకులు మృతి చెందినట్లు స్థానికులు చెబుతున్నారు.

బస్సు ప్రమాద ఘటన సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో మృతి చెందిన వారిని బస్సు కిటికీల నుంచే బయటకు తీశారు. అలాగే బస్సులోని కిటికీల నుంచి కొందరు ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులను ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. కాగా బస్సులోపలే ఉన్న వారిని స్థానికులు పడవల సాయంతో ఒడ్డుకు చేర్చారు. కాగా ప్రమాద ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రమాదంలో చిన్నారావు(డ్రైవర్), సరోజిని (ద్వారకాతిరుమల), మధుబాబు (చిన్నంవారిగూ డెం), దుర్గమ్మ (తాడువాయి), జాన్ (గంగవరం), సత్యవతి (నందిగూడెం), మహాలక్ష్మి (జంగారెడ్డిగూడెం), ప్రసాద్, బుల్లెమ్మ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

ప్రధాని, సిఎం, గవర్నర్‌ల తీవ్ర దిగ్భ్రాంతి

పశ్చిమగోదావరి జిల్లా జల్లేరు వద్ద జరిగిన బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎపి సిఎం జగన్, గవర్నర్ విశ్వభూషణ్‌లు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బస్సు ప్రమాద ఘటన అత్యంత విచారకరమని, తీవ్రంగా బాధ కలిగించిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామన్నారు.

మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా

పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం పట్ల ఆంధ్రప్రదేశ్ సిఎం జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేయడంతోపాటు ప్రమాదంలో మరణించిన వారి కుటుం బాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందేలా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను సిఎం ఆదేశించారు. అలాగే బస్సు ప్రమాదంపై మంత్రి పేర్నినాని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేయడంతో పాటు ప్రమాదంపై విచారణకు ఆదేశించారు. విచారణ జరిపి నివేదిక అందించాలని ఉన్నధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇదిలావుండగా జల్లేరు వద్ద జరిగిన బస్సు ప్రమాదంపై ఎపిఎస్‌ఆర్‌టిసి ఎండి ద్వారకా తిరుమలరావు స్పందిస్తూ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ఆర్‌టిసి తరఫున రూ. 2.5 లక్షల పరిహారాన్ని అందిస్తున్నట్లు ప్రకటించారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News