Friday, May 3, 2024

ఆర్‌టిసి బిల్లుకు తమిళి ‘నై’

- Advertisement -
- Advertisement -
విలీనం బిల్లు ఆపడంపై కార్మికుల ఆగ్రహం
ఛలో రాజ్‌భవన్‌కు పిలుపునిచ్చిన సంఘాల నాయకులు
వీలైనంత త్వరగా పాస్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం
ఉద్దేశ్య పూర్వకంగానే గవర్నర్ చేస్తుందని బిఆర్‌ఎస్ వర్గాల్లో చర్చ

హైదరాబాద్:  రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్టీసి ప్రభుత్వ విలీనం బిల్లుపై అయోమయం నెలకొన్నది. ఈబిల్లు పరిశీలనకు న్యాయ సలహా కోసం సమయం కావాలని గవర్నర్ కార్యాలయం ప్రకటించడం తీవ్ర వివాదం సృష్టించింది. ప్రజారవాణ వ్యవస్థ బాధ్యతగా భావించి, ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సంక్షేమం లక్ష్యంగా ఆర్టీసి కార్మికులను ఉద్యోగులుగా గుర్తిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి తీర్మానం చేసి 43,373 మంది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసింది. తాజాగా నడుస్తున్న అసెంబ్లీలో బిల్లు పాస్ చేయాలనే ధృడ సంకల్పంతో, ఇందుకు సంబంధించి కార్యాచరణను యుద్దప్రాతిపదికన చేపట్టి బిల్లును రాష్ట్ర ప్రభుత్వం రూపొందించి ఈనెల 2వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు గవర్నర్‌కు పంపింది. సాంకేతికపరంగా చూస్తే ఇది ఆర్ధిక పరమైన కావడంతో కాన్సెంట్ కోసం రాష్ట్ర గవర్నర్‌కు ఇప్పటికే పంపించింది.

ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు ముగిసే సమయానికి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లుపై గవర్నర్ నుంచి ఆమోదం రావడం తప్పనిసరి. కాగా గత రెండు రోజులుగా రాష్ట్ర గవర్నర్ బిల్లుపై తన అభిప్రాయాన్ని చెప్పకుండా కాలయాపన చేస్తున్నది. గవర్నర్ వైఖరి చూస్తుంటే ప్రభుత్వంపై వ్యతిరేక ధోరణితో మిగతా బిల్లులను ఆపినట్లే ఆర్టీసి బిల్లును కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టకుండా ఆపి ఇటు ప్రభుత్వాన్ని, అటు ఆర్టీసీ కార్మికులను ఇబ్బంది పెట్టాలనే ఆలోచన ఉన్నట్లు బిఆర్‌ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే ఆందోళన కలిగిస్తున్న గవర్నర్ వైఖరి ఆర్టీసి బిల్లు విషయంలో అనుసరిస్తున్న తాత్సార వైఖరి వేలాది మంది బడుగు బలహీన వర్గాలు, పేదలే అధికంగా ఉన్న ఆర్టీసి కార్మికుల కుటుంబాలకు మరిన్ని ఇబ్బందులు సృష్టించే ప్రమాదం వుంది.

న్యాయ సలహాల కోసం మరికొంత సమయం అవసరం: రాజ్‌భవన్ వర్గాలు
ఆర్టీసీ బిల్లు విషయంలో రాజ్ భవన్ కీలక ప్రకటన చేసింది. ఈ బిల్లును. పరిశీలించేందుకు మరికొంత సమయం అవసరం అని స్పష్టం చేసింది. ఆర్టీసీ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి గవర్నర్ నుండి అనుమతి రాలేదని ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం రాజ్ భవన్ అధికారులు క్లారిటీ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడానికి ఒక రోజు ముందే ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడానికి సంబంధించిన బిల్లు రాజ్ భవన్ కు వచ్చిందని తెలిపారు. ఈ నెల 2వ తేదీ మధ్యాహ్నం 3:30 గంటలకు ఆర్టీసీ బిల్లును సభలో ప్రవేశపెట్టేందుకు అనుమతి కోసం అభ్యర్ధించారని అయితే ఈ అభ్యర్థనపై నిర్ణయం తీసుకోవడానికి ముందు బిల్లును పరిశీలించి లీగల్ ఒపీనియన్ తీసుకోవడానికి మరికొంత సమయం అవసరం అని స్పష్టం చేశారు.

గవర్నర్ బిల్లు ఆమోదించకపోతే రాజ్‌భవన్ ను ముట్టడిస్తాం: టిఎంయు ప్రధాన కార్యదర్శి థామస్ రెడ్డి
రాష్ట్ర ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని క్యాబినెట్లో సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుని పంపిన బిల్లును గవర్నర్ ఆమోదించకపోవడం సరైన విధానం కాదని టిఎంయు ప్రధానకార్యదర్శి థామస్‌రెడ్డి మండిపడ్డారు. ఆర్టీసీలో ఉన్న 43 వేల 373 మంది కుటుంబాలలో వెలుగులు సిఎం కెసిఆర్ నింపారని, ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ఆ బిల్లును గవర్నర్‌కు పంపిస్తే ఇప్పటివరకు ఆ బిల్లుపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం ఆవేదన వ్యక్తం చేశారు. ఇది 43 వేల మంది ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన సమస్యని గవర్నర్ పార్టీ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.మా జీవితాలలో వెలుగులు నింపే ఈ బిల్లును వెంటనే ఆమోదించాలని లేనిపక్షంలో ఆర్టీసీ కార్మికులంతా నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాలను చేపడతామని అవసరమైతే రాజ్ భవన్ ముట్టడికి కూడా వెనకాడమని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News