Sunday, April 28, 2024

పారిశుద్ధ్య కార్మికులు సమ్మె వీడి.. విధుల్లో చేరండి: హరీశ్ రావు విజ్ఞప్తి

- Advertisement -
- Advertisement -

సిద్ధిపేట: వర్షాకాల నేపథ్యంలో సీజనల్ వ్యాధుల వ్యాపించి ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతాయని. అంటువ్యాధులు పెరిగే అవకాశం ఉంటుందని, పారిశుద్ధ్య కార్మికుల విషయాన్ని ప్రభుత్వం తప్పకుండా ఆలోచన చేస్తుందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలే దృష్ట్యా ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని, దయచేసి గ్రామ పంచాయతీ కార్మికులంతా వెంటనే సమ్మె వీడి తమ విధుల్లో చేరాలని పారిశుద్ధ్య కార్మికులకు మంత్రి హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు.

పారిశుద్ధ్య కార్మికుల విషయాన్ని ప్రభుత్వం తప్పకుండా ఆలోచన చేస్తుందని, ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ అడగకుండానే వెయ్యి రూపాయల వేతనాన్ని పెంచారని గుర్తు చేశారు. ఇప్పటికీ ఆయన దృష్టిలో పారిశుద్ధ్య కార్మికుల డిమాండ్లు ఉన్నాయని, సమయానుకూలంగా నిర్ణయం తీసుకుంటారని మంత్రి హరీశ్ రావు భరోసా ఇచ్చారు. పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మీతో చర్చలు జరిపి తప్పకుండా వీలైనంత వరకూ త్వరితగతిన సాయం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని మంత్రి హరీశ్ రావు తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులంతా సమ్మెను విరమించి అందరూ పని చేయాలని, ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఇతర రాష్ట్రాల కంటే మన తెలంగాణ రాష్ట్రంలో పారిశుద్ధ్య కార్మికులకు అధికంగా వేతనాలు ఇస్తున్నట్లు మంత్రి చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి వేతనాలు అందిస్తున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలలో 500, 1000 కూడా లేని వేతనాలను గ్రామాల్లో కార్మికులు గౌరవంగా బతకాలనే ఉద్దేశ్యంతో అడగకుండానే 8 వేల 500 రూపాయలకు పెంచారు. అలాగే అడగకుండానే ఈ మధ్యే 8 వేల 500 నుంచి 9 వేల 500కు పెంచిన మనసున్న మనిషి కేసీఆర్ అని తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లె ప్రగతి లాంటి గొప్ప కార్యక్రమాన్ని తీసుకుని మన పల్లెలు దేశానికే ఆదర్శంగా నిలిచేటట్లు చేశారని గుర్తు చేస్తూ.. ఈ విజయంలో గ్రామ పంచాయతీల సెక్రటరీలు, మల్టీపర్పస్ వర్కర్ల పాత్ర మరువలేనిదని తెలిసి వారిని అన్ని విధాలుగా గౌరవంగా తెలంగాణ ప్రభుత్వం చూస్తున్నదని మంత్రి హరీశ్ రావు తెలిపారు. పనికి మాలిన రాజకీయాలు చేసే కొన్ని పార్టీల ఉచ్చులో పడొద్దని సీఏం కేసీఆర్ మిమ్మల్ని అందరినీ చల్లగా చూస్తారని, ఏలాంటి సమ్మెలు, ధర్నాలు వంటి కార్యక్రమాల్లో పాల్గొని తెలంగాణ పల్లెలకున్న గొప్ప పేరును ఖరాబు చేయొద్దని పారిశుద్ధ్య కార్మికులను మంత్రి హరీశ్ రావు వేడుకున్నారు. అలాగే కొంత మంది క్వాలిఫైడ్ కార్మికులు “అసిస్టెంట్ పంచాయతీ కార్యదర్శి” గా గుర్తింపు ఇవ్వాలని కోరినట్లు, దాన్ని కూడా సీఏం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్తామని మంత్రి హరీశ్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News