Friday, May 3, 2024

పేద ప్రజలకు సేవ చేయడం దైవ సేవతో సమానం

- Advertisement -
- Advertisement -
  • చేవెళ్ల ఎంపి గడ్డం రంజిత్‌రెడ్డి

చేవెళ్ల: నిరుపేదలకు సేవ చేయడం.. దైవసేవతో సమానమని చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు గడ్డం రంజిత్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆరోగ్య రథం కార్యక్రమాన్ని చేవెళ్ల మండల పరిధిలోని ఆలూరు గ్రామంలో చేవెళ్ల శాసనసభ్యులు కాలె యాదయ్యతో కలిసి ఆదివారం ప్రారంభించారు.

అంతకుముందు ఆలూరు గ్రామంలోని అంబేడ్కర్ విగ్రహానికి, ప్రజా గాయకుడు వేద సాయిచంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతిఒక్కరికి ఆరోగ్యం చాలా ముఖ్యమని తెలిపారు. ప్రజల ఆనందమే, ఆరోగ్యమే నా మొదటి ప్రాధాన్యత అని పేర్కొన్నారు. ప్రజా గాయకుడు వేద సాయిచంద్ మృతి నన్ను తీవ్రంగా కలిచివేసిందన్నారు.

తెలంగాణ ప్రభుత్వం సాయిచంద్ కుటుంబానికి అండగా నిలుబడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో ఉండాలనే సంకల్పంతో ఆరోగ్య రథాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు. వ్యక్తిగత ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ దృష్టిపెట్టాలని సూచించారు. ఆరోగ్య రథంలో ప్రతి ఒక్కరికి ఉచితంగా అన్ని రకాల పరీక్షలు వైద్యులు నిర్వహిస్తారని ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకే ఈ ఆరోగ్య రథం ప్రాధాన్యత కల్పింస్తుందన్నారు. గడప గడపకు ఆరోగ్యమే మన చేవెళ్ల ఆరోగ్య రథం ప్రధాన ఉద్ధేశ్యమన్నారు.

ఇలాంటి ఆరోగ్య రథాన్ని చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలకు అందించేందుకు కృషి చేస్తామని ఆయన వెల్లడించారు. ఈ రోజు నుంచి సంచార ఆరోగ్య రథం ద్వారా మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజలకు వైద్యసేవలను అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. చిన్న, పెద్ద అనే తారతమ్యం లేకుండా వైద్యసేవలు అందించి ఏదైన ఆపరేషన్లు చేయాల్సి వస్తే అన్ని ఆరోగ్య రథం వైద్యులే చూసుకుంటారన్నారు.

ఆయా గ్రామానికి ఆరోగ్యం రథం వచ్చినప్పుడు ప్రజలు వైద్య సేవలు వినియోగించుకోవాలన్నారు. ప్రతి గ్రామంలో రెండు రోజుల పాటు సంచార ఆరోగ్య రథం ద్వారా ప్రజలకు వైద్య సేవలు నిర్వహిస్తారని వెల్లడించారు. సీఎం కేసిఆర్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో టెస్టులు పెంచడంతోపాటు ఆయా ఆసుపత్రుల్లో ఉచిత ఆపరేషన్‌లు కూడా చేయించే విధంగా చర్యలు తీసుకుందన్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం మెడికల్ కళాశాలతోపాటు సూపర్ స్పెషాలిటి ఆసుపత్రులను కూడా నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుందన్నారు.

నిరుపేదలు సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే కాలె యాదయ్య

గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ఈ ఆరోగ్య రథాన్ని సద్వినియోగం చేసుకోవాలని చేవెళ్ల శాసనసభ్యులు కాలె యాదయ్య సూచించారు. నిరుపేదల కోసం ఇలాంటి సంచార ఆరోగ్యరథం ద్వారా వైద్యసేవలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. ఆరోగ్య రథం ప్రారంభించిన చేవెళ్ల ఎంపి గడ్డం రంజిత్‌రెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి మెడికల్ కళాశాల వారికి చేవెళ్ల నియోజకవర్గం ప్రజల తరపున ప్రత్యేక అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో చేవెళ్ల జడ్పిటిసి సభ్యురాలు మర్పల్లి మాలతికృష్ణారెడ్డి, మొయినాబాద్ జడ్పిటిసి సభ్యులు కాలె శ్రీకాంత్, చేవెళ్ల ఎంపిపి మల్గారి విజయలక్ష్మీరమణారెడ్డి, వైస్ ఎంపిపి కర్నె శివప్రసాద్, ఆలూరు సర్పంచ్ కవ్వగూడెం విజయలక్ష్మీనర్సింలు, దేవరంపల్లి సర్పంచ్ నరహరిరెడ్డి, అంతారం సర్పంచ్ అంజయ్యగౌడ్, బీఆర్‌ఎస్ చేవెళ్ల, మొయినాబాద్ మండల పార్టీ అధ్యక్షులు పెద్దోళ్ల ప్రభాకర్, మహేందర్‌రెడ్డి ప్రధాన కార్యదర్శి నరేందర్‌గౌడ్, బీఆర్‌ఎస్ నాయకులు బేగరి నర్సింలు, జైపాల్‌రెడ్డి ఆయా గ్రామాల బిఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News