బీజింగ్ : కోవిడ్ సంక్షోభం తరుణంలో భారతదేశం ఔషధ ప్రపంచ పాత్ర పోషిస్తోందని షాంఘై సహకార సంస్థ అభినందించింది. ఈ సంస్థ సెక్రెటరీ జనరల్ వ్లాదిమిర్ నొరోవ్ దీనికి సంబంధించి ఓ ప్రకటన వెలువరించారు. వైద్యరంగంలో భారత్కున్న అపార అనుభవం, విశేష విజ్ఞానంతో సంక్లిష్ట అనారోగ్య సమస్యలకు సరైన మందులు కనుగొంటూ వస్తోందని తెలిపారు. ప్రస్తుత కరోనా దశలో భారతీయ వైద్య విజ్ఞానంతో ప్రాంతీయ, ప్రపంచ స్థాయిలో పలు విధాలుగా ఆవిష్కరణలకు వీలవుతోందని చెప్పారు.
భారతదేశం ఇప్పటివరకూ కరోనా చికిత్స దిశలో 133 దేశాలకు మెడిసిన్స్ పంపించిందని, ఇది భారతదేశ ఔదార్యాన్ని చాటుతోందని వ్లాదిమిర్ తెలిపారు. వైరస్ బెడద ఏర్పడినట్లు తెలియగానే భారతదేశం వెంటనే స్పందించిందని, జాతీయ స్థాయిలో వైరస్ నివారణకు , చికిత్సకు అన్ని చర్యలూ చేపట్టిందని, దీనితో సత్ఫలితాలు కన్పించాయని చెప్పారు. ఓ ప్రధాన శక్తి అయిన దేశం అత్యంత విలువైన ఆదర్శప్రాయమైన పాత్రను పోషించడం మంచి పరిణామం అని వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో తెలిపారు. భద్రతా మండలికి భారత్ ఎన్నికపై స్పందిస్తూ ఇది మంచి పరిణామం అని, సభ్యత్వం కేవలం ప్రతీకాత్మకంగా ఉండదని, ఆచరణాత్మకం అవుతుందని వ్యాఖ్యానించారు.