మనతెలంగాణ/రామన్నపేట: ప్రేమించిన వ్యక్తితోనే వివాహం జరిపించాలని డిమాండ్ చేస్తూ ఓ యువతి గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం జనంపల్లి గ్రామంలో ప్రియుడి ఇంటిముందు తన కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి ఆందోళనకు దిగింది. బాధితురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం… రామన్నపేట పటణ కేంద్రానికి చెందిన వంగాల లక్ష్మణ్, రేణుక కుమార్తె దీపిక, జనంపల్లి గ్రామానికి చెందిన వంగాల మారయ్య శంకరమ్మల కుమారుడు నవీన్లు మూడు సంవత్సరాల క్రితం ఫేస్బుక్ ద్వారా పరిచయమయ్యారు. పరిచయం కాస్త ప్రేమగా మారడంతో వివాహం చేసుకుందామని నిర్ణయిం తీసుకున్నారు. దీపిక వివాహం చేసుకోవాలని నవీన్ను పలుమార్లు కోరగా వాయిదాలు వేస్తూ వచ్చాడు. వారం రోజుల క్రితం దీపిక వివాహం చేసుకొమ్మని ఒత్తిడి చేయగా నిరాకరించాడు. దీంతో దీపిక తనకు జరిగిన అన్యాయం పెద్ద మనషుల దృష్టికి తీసుకెళ్లింది. తనకు నవీన్తోనే వివాహం జరిపించాలని పోలీసులను కూడా ఆశ్రయించింది. నవీన్ అతని కుటుంబసభ్యులు పెళ్లికి నిరాకరించడంతో గురువారం ఆమె అతని ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. తనను పెళ్లి చేసుకునేంత వరకు ఆందోళనను విరమించేది లేదని చెప్పింది. ఈ సంఘటనతో నవీన్ కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు.