రూ.6 లక్షల కోట్ల భారం : కేంద్రం
న్యూఢిల్లీ: ఆరు నెలల మారటోరియమ్ కాలానికి వడ్డీలు మాఫీ చేస్తే బ్యాంకుల ఉనికి దెబ్బతింటుందని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఆరు నెలల కాలానికి అన్ని వర్గాలవారికీ రుణమాఫీ చేయడం వల్ల రూ.6 లక్షల కోట్లమేర బ్యాంకలపై భారం పడుతుందని పేర్కొన్నది. కొవిడ్19 ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని రుణ గ్రహీతలకు ఆరు నెలలపాటు వాయిదాల చెల్లింపుల విషయంలో ఆర్బిఐ వెసులుబాటు కల్పించింది. అయితే, ఆ కాలానికి వడ్డీలు మాఫీ చేయాలంటూ పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్ అశోక్భూషణ్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం విచారణ జరుపుతోంది.
మంగళవారం విచారణ సందర్భంగా కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వివరణ ఇచ్చారు. డిపాజిటర్లకు బ్యాంకులు వడ్డీలు చెల్లించాల్సి ఉంటుందని, వారంతా చిన్న మొత్తాలు పొదుపు చేసుకునేవారేనని మెహతా తెలిపారు. ఎస్బిఐ పరిస్థితిని ఆయన ఉదాహరణగా చూపారు. ఆరు నెలల సమయానికి డిపాజిటర్లకు ఎస్బిఐ చెల్లించాల్సిన వడ్డీ రూ.75,157 కోట్లు కాగా, రుణగ్రహీతలు చెల్లించాల్సిన వడ్డీ రూ. 88,078 కోట్లని మెహతా తెలిపారు.