Saturday, May 4, 2024

కలెక్టరేట్లపై సోలార్ సొబగులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : కాలుష్య రహిత తెలంగాణ నిర్మాణంలో భాగంగా ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ హారితహారం కార్యక్రమాన్ని చేపట్టి హరిత తెలంగాణగా మార్చేశారు. అదే స్పూర్తితో తెలంగాణ రాష్ట్ర పునరుత్పాధక శక్తి అభివృద్ధి సంస్థ పనిచేస్తోంది. ఇందులో భాగంగా జిల్లాల్లో కొత్తగా నిర్మితమవుతున్న కలెక్టరేట్ భవనాల్లో సోలార్ విద్యుత్ వినియోగాన్ని పెంచేదిశగా అవగాహన కల్పిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం(కలెక్టరేట్ కాంప్లెక్స్)లో 200 కిలోవాట్ల గ్రిడ్ అనుసంధానిత సోలార్ విద్యుత్ ప్లాంట్‌ను తెలంగాణ రెడ్కో సంస్థ ఏర్పాటు చేసింది. పార్కింగ్ స్థలాన్ని సద్వినియోగం చేసుకునేలా.. పార్కింగ్ ఏరియాపై భాగం లో సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కలెక్టరేట్ కాంప్లెక్స్‌లో హైటెన్షన్ సర్వీస్‌లో నెలకు దాదాపు 14 వేల యూనిట్లకు పైగా విద్యుత్‌ను వినియోగిస్తున్నారు.అలాగే లోటెన్షన్ సర్వీస్‌లో మరో 14 వేల యూనిట్లకు పైగా విద్యుత్ వినియోగమవుతోంది. అంటే నెలకు మొత్తం 28వేల యూ నిట్లకు పైగా విద్యుత్ అవసరం అవుతోంది. 200 కిలోవాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుతో 24వేల యూనిట్ల వరకు సోలార్ విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది.

దీనివల్ల రెండు సర్వీసుల్లో కలిపి నెలకు కేవలం 4 వేల నుంచి 5 వేల యూనిట్ల వర కు మాత్రమే గ్రిడ్ నుంచి వినియోగించుకోవాల్సి ఉంటుంది. దానికి మాత్రమే బిల్లు చెల్లించాల్సి ఉం టుంది. ప్రస్తుతం నెలకు లక్షా ఎనభై వేల రూపాయలకు పైగా విద్యుత్ బిల్లు వస్తోంది. సోలార్ ప్లాంట్ ఏర్పాటుతో దాదాపు 80 శాతం వరకు వి ద్యుత్ బిల్లు తగ్గనుంది. సోలార్ విద్యుత్ వినియో గం వల్ల ఏటా దాదాపు 23 లక్షల రూపాయల వరకు చార్జీల భారం తగ్గనుంది. ఈ లెక్కన 200 కిలోవాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి అయిన ఖర్చు ఆరున్నర సంవత్సరాల్లో తీరిపోనుం ది. అలాగే సూర్యాపేట జిల్లా సమీకృత జిల్లా కా ర్యాలయాల సముదాయం(కలెక్టరేట్ కాంప్లెక్స్)లో 100 కిలోవాట్ల సోలార్ రూఫ్ టాప్ విద్యుత్ ప్లాం ట్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. కలెక్టరేట్ కాం ప్లెక్స్‌ను, సోలార్ ప్లాంట్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 20వ తేదీన ప్రారంభించనున్నారు. దీని ద్వారా ఏటా లక్షా 44వేల యూనిట్ల విద్యుత్ ఉత్ప త్తి అవుతుంది. దీని ద్వారా ఏటా 11 లక్షల 23 వేల 200 రూపాయలు ఆదా కానున్నాయి. నిర్మించడానికి అయిన వ్యయం ఐదున్నర ఏళ్లలో తీరిపోనుంది.

అలాగే రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కాంప్లెక్స్ లో 100 కిలోవాట్ సామర్థ్యంతో సోలార్ ప్లాంట్, కామారెడ్డి కలెక్టరేట్ కాంప్లెక్స్ లో మరో 100 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న ప్లాంట్ పనులు పురోగతిలో ఉన్నాయి. ఈ సోలార్ ప్లాంట్ ల నిర్వహణ బాధ్యతలు 20 ఏళ్ల పాటు తెలంగాణ పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ చూసుకోనుంది. వినియోగదారులకు ఇబ్బంది లేకుండా ప్లాంట్ లో ఎలాంటి సమస్యలు వచ్చినా సంస్థే వాటిని సరిచేస్తుంది. కాబట్టి రాష్ట్రంలోని ఇతర కలెక్టరేట్ కాంప్లెక్స్ లు, ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్ విద్యుత్ ప్లాంట్‌లు ఏర్పాటు చేసేందుకు అధికారులు చొరవ చూపాలని తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ చైర్మన్ వై.సతీష్ రెడ్డి కోరారు. తద్వారా సంప్రదాయ విద్యుత్ ఉత్పత్తి వల్ల జరిగే కాలుష్యా న్ని తగ్గించడంతో పాటు.. విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించుకోవచ్చన్నారు. ప్లాంట్ ఏర్పాటుకు అయిన ఖర్చు కూడా గరిష్టంగా ఐదున్నర నుంచి ఆరున్నర ఏళ్లలో తిరిగివస్తుందన్నారు. ఆర్థికభారం కూడా కాదు కాబట్టి.. ప్రభుత్వ కార్యాలయాలు సోలార్ విద్యుత్ దిశగా ఆలోచన చేయాలని ఆయన సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News