దివంగత ఎంఎల్ఎ సోలిపేట రామలింగారెడ్డి ఆశయాన్ని నెరవేర్చడానికి, అక్కడి అభివృద్ధి కొనసాగించడానికి ఆయన సతీమణి ఎంపిక
ప్రకటించిన కెసిఆర్
అందరినీ సంప్రదించాకే అభ్యర్థిత్వం ఖరారు : సిఎం కెసిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్ : దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భార్య సోలిపేట సుజాత పేరును ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావు ఖరారు చేశారు. “సోలిపేట రామలింగారెడ్డి తెలంగాణ ఉద్యమంలో కృయాశీల పాత్ర పోషించారు. ఉద్యమం కోసం, పార్టీ కోసం అంకిత భావంతో ఆయన పని చేశారు. దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి చివరి శ్వాస వరకు ఆయన ఎంతో కష్టపడి పని చేశారు. రామలింగారెడ్డి కుటుంబం యావత్తు అటు ఉద్యమంలోనూ ఇటు నియోజకవర్గ అభివృద్ధిలోనూ పాలు పంచుకుంది. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలతో ఆ కుటుంబానికి అనుబంధం ఉంది. రామలింగారెడ్డి తలపెట్టిన నియోజకవర్గ అభివృద్ధిని కొనసాగించడానికి, నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యక్రమాలు యధావిధిగా అమలు కావడానికి సోలిపేట రామలింగారెడ్డి కుటుంబ సభ్యులే నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించడం సమంజసమని, జిల్లాలోని నాయకులతో సంప్రదింపులు జరిపాకే సుజాత అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశామని సిఎం కెసిఆర్ ప్రకటించారు.