తక్షణమే విడుదలకు సిఎం కెసిఆర్ ఆదేశాలు
కరోనాపై బస్తీల్లో అవగాహన కార్యక్రమం
హోర్డింగ్లు, కరపత్రాలు, సినిమాహాళ్లు, బహిరంగ ప్రదేశాల్లో స్క్రీన్ ప్రచారాలు
విద్య, పర్యాటకం, పంచాయతీరాజ్, మున్సిపల్ తదితర శాఖలతో ప్రత్యేక కమిటీ, పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్ష
మంత్రివర్గ ఉపసంఘం సుదీర్ఘభేటీ తర్వాత ముఖ్యమంత్రికి ఫోన్లో వివరించిన మంత్రి ఈటల, తక్షణమే రూ.100కోట్ల ప్రత్యేక బడ్జెట్ విడుదలకు సిఎం ఆదేశం
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కొవిడ్19 (కరోనా) పాజిటివ్ కే సు నమోదవడంతో వైరస్ నియంత్రణ కోసం సిఎం కెసిఆర్ రూ. 100 కోట్ల ప్రత్యేక బడ్జెట్ నిధులను విడుదల చేశారు. హైదరాబాద్ నగరంతో పాటు వివిధ జిల్లాల్లో కొవిడ్ వైరస్పై అవగాహన కొరకు అన్ని కార్యక్రమాలు నిర్వహించాలని సిఎం వైద్యశాఖకు సూచించారు. హైదరాబాద్ నగరంలో ఓ సాప్ట్వేర్ ఉద్యోగికి కొవిడ్ పాజిటివ్ రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ఈ క్రమం లో వైద్య ఉపసంఘం మంగళవారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. దాదాపు 4 గంటలకు పైగా జరిగిన సమావేశంలో కొ విడ్ నియంత్రణ, చేయాల్సిన అవగాహన కార్యక్రమాలు, జాగ్రత్తలు చికిత్స వంటి పలు విషయాలపై వైద్య ఉన్నతాధికారులతో సుదీర్ఘ చర్చలు జరిగాయి.
అనంతరం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిని మంత్రి ఈటల సిఎంకు ఫోన్లో వివరించారు. తక్షణమే తొలి విడతగా రూ. 100 కోట్ల్ల ప్రత్యేక బడ్జెట్ను విడుదల చేశారు. ముఖ్యంగా బస్తీల్లో అధికంగా అవగాహన చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు కూడా సిద్దం చేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో హోర్టింగ్స్, కరప్రతాలతో పాటు సినిమా హాళ్లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో ప్రత్యేక స్క్రీన్ల ద్వారా వైరస్పై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. విద్య, టూరిజం, పంచాయితీరాజ్, మున్సిపల్తో పాటు ఇతర శాఖలను కో ఆర్డినేషన్ చేస్తూ ఒక ప్రత్యేక కమిటిని ఏర్పాటు చేసి, కరోనాపై ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించేందుకు సర్వం సిద్దం చేశారు.