వాలంటీర్లో వివరించలేని అనారోగ్యం
న్యూబ్రూన్సివిక్ (అమెరికా): అమెరికాకు చెందిన ఫార్మా దిగ్గజం జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ను తీసుకున్న ఓ వాలంటీర్లో అంతుచిక్కని అనారోగ్య సమస్య తలెత్తడంతో ఆ వ్యాక్సిన్ ట్రయల్స్ తాత్కాలికంగా ఆగిపోయాయి. ఇప్పటికే రెండు దశల్లో ఆశాజనక ఫలితాలు వచ్చినట్టు ఆ సంస్థ గత నెలలో ప్రకటించినప్పటికీ మూడోదశ కోసం ప్రపంచ వ్యాప్తంగా 60 వేల మంది వాలంటీర్లపై ఈ టీకాను ప్రయోగించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈమేరకు నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. అయితే ఈ వ్యాక్సిన్ తీసుకున్న ఓ వ్యక్తిలో ఇటీవల అనూహ్యమైన అనారోగ్య సమస్యలు తలెత్తినట్టు గుర్తించడంతో భద్రతా ప్రమాణాల ప్రకారం ట్రయల్స్ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.
ఎలాంటి ట్రయల్స్ కైనా భారీ ఎత్తున అధ్యయనం చేస్తున్నప్పుడు అస్వస్థత, వ్యతిరేక ప్రభావాలు వంటివి ఎదురు కావడం సహజమని సంస్థ సోమవారం సాయంత్రం ప్రకటించింది. ఆ వాలంటీర్ అస్వస్థత కాడానికి కారణాలు ఏమిటో ఇండిపెండెంట్ సేఫ్టీ కమిటీ సమీక్షిస్తుందని, అలాగే కంపెనీకి చెందిన క్లినికల్ భద్రతా పర్యవేక్షణ ప్యానెల్ గుర్తించడానికి ప్రయత్నిస్తుందని వివరించింది. వీరి నివేదికల ఆధారంగా ట్రయల్స్ మళ్లీ చేపడతామని వెల్లడించింది. వాలంటీర్ అస్వస్థత ఏమిటో గోప్యతను దృష్టిలో పెట్టుకుని వివరాలు తెలియచేయడానికి నిరాకరించింది. సెప్టెంబర్లో ఆక్స్ఫర్డ్, ఆస్ట్రా జెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ ట్రయల్స్ కూడా ఇదే విధంగా ఆగి పోయిన సంగతి తెలిసిందే.