న్యూఢిల్లీ: ఇంటివద్దకే మద్యం సరఫరా (డోర్ డెలివరీ) లేదా పరోక్ష అమ్మకాలను పరిశీలించాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. మద్యం దుకాణాల వద్ద జనం పెద్ద సంఖ్యలో గుమి కూడకుండా, భౌతిక దూరం ఆంక్షలు పటిష్టంగా అమలయ్యేలా చూడడం కోసం తమ సలహాను పరిశీలించాలని పేర్కొంది. కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ అమలవుతున్న సమయంలో మద్యం అమ్మకాలకు అనుమతినివ్వడం సాధారణ పౌరుడి జీవితంపై ప్రభావం చూపిస్తోందంటూ దాఖలైన పిల్ను న్యాయమూర్తులు అశోక్ భూషణ్, ఎస్కు కౌల్, బిఆర్ గవాయ్లతో కూడిన సుప్రీం ధర్మాసనం గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. ‘ మేం ఎలాంటి ఆదేశాలను జారీ చేయం. భౌతిక దూరం పాటించేందుకు ఇంటివద్దకే మద్యం సరఫరా చేయడం లేదా పరోక్ష అమ్మకాలను రాష్ట్రాలు కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలి’ అని ధర్మాసనం తెలిపింది. ‘ ఇంటివద్దకే మద్యం సరఫరాపై చర్చలు కొనసాగుతున్నాయి.
మమ్మల్ని ఏం చేయమంటారు’ అని న్యాయమూర్తి కౌల్ ప్రశ్నించారు. పరిమిత సంఖ్యలోనే మద్యం దుకాణాలను తెరవడం వల్ల భౌతిక దూరం పాటించడం అమలు కష్టమవుతోందని పిటిషనర్ గురుస్వామి నటరాజ్ తరఫు న్యాయవాది సాయి దీపక్ వాదించారు. ‘ మద్యం అమ్మకాల వల్ల సామాన్యుడి జీవితంపై ప్రభావం పడొద్దు. విక్రయాలపై కేంద్ర హోం శాఖ రాష్ట్రాలకు స్పష్టతనివ్వాలి’ అని ఆయన అన్నారు. మద్యాన్ని ఇంటివద్దకే సరఫరా చేసే అంశాన్ని జోమాటో పరిశీలిస్తున్నట్లు ఇంతకు ముందే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కాగా అందుకు సంబంధించి చట్టపరమైన భారత్లో లేదని తెలుస్తోంది. నిబంధనల మార్పుకోసం కొందరు లాబీయింగ్ చేస్తున్నారని సమాచారం.