లక్నో సిబిఐ కోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశం
నిందితులుగా అద్వానీ, సింఘాల్, జోషి తదితర ప్రముఖులు
న్యూఢిల్లీ : బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను జారీచేసింది. బాబ్రీ మసీదు కూల్చివేత కేసును ఆగస్ట్ 31లోపు పూర్తి చేయాలని లక్నో సిబిఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తిని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. విచారణ పూర్తి చేసి తుది తీర్పును కూడా వెలువరించాలని కోర్టు తెలిపింది. ఈ కేసులో బిజెపి అగ్రనేత ఎల్కే అద్వానీ, అశోక్ సింఘాల్, మురళీ మనోహర్ జోషీ, ఉమాభారతి, వినయ్ కటియార్, గిరిరాజ్ కిషోర్, నాటి యుపి సిఎం కళ్యాణ్సింగ్ కూడా ఉన్నారు. కరసేవకులను రెచ్చగొట్టి కుట్రపూరితంగానే మసీదును కూల్చివేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
దాదాపు 28 ఏళ్ల పాటు కోర్టుల్లో విచారణ సాగుతున్న ఈ కేసును సుప్రీంకోర్టు తాజాగా తెరపైకి తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది. అయోధ్య వివాదంపై తీర్పును వెలువరిస్తున్న సమయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ తీర్పును వెలువరిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ‘1992 డిసెంబర్ 6న కరసేవకులు వివాదాస్పద బాబ్రీ మసీదును కూల్చివేశారు. ఇది ముమ్మాటికి చట్ట విరుద్ధం. మసీదును ధ్వసం చేసి ఇస్లామిక్ మూలాలను దెబ్బతీయడానికి ప్రయత్నించారు. ముస్లిం వర్గాలకు కచ్చితంగా న్యాయం జరగాల్సింది’ అంటూ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో విచారణను ముగించాలని సుప్రీంకోర్టు సీబీఐ కోర్టును ఆదేశించింది.