మహారాష్ట్ర పోలీసుకు చుక్కెదురు
న్యూఢిల్లీ: ఆత్మహత్యకు ప్రేరేపించాడనే కారణంతో అరెస్టు అయిన రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్చీఫ్ అర్నాబ్ గోస్వామికి బెయిల్ దక్కింది. వాదనలు పరిశీలించిన తరువాత బుధవారం సుప్రీంకోర్టు ఆయన మధ్యంతర బెయిల్కు ఉత్తర్వులు వెలువరించింది. అన్వాయ్ నాయక్ను ఆత్మహత్యకు ప్రేరేపించాడనే కేసులో అర్నాబ్ జైలు పాలయ్యారు. బుధవారమే ఆయన బెయిల్ పిటిషన్ అత్యున్నత న్యాయస్థానం విచారణకు వచ్చింది. వాదోపవాదాల తరువాత సుప్రీంకోర్టు ఇతర నిందితులకు బెయిల్ ఇస్తున్నట్లు ప్రకటించింది. అర్నాబ్ తరఫున న్యాయవాది హరీష్ సాల్వే తమ వాదన విన్పించారు. నాయక్కు చెందిన డికరేషన్ సంస్థ ఏడేళ్లుగా బాకీ పడి ఉందని. దీని కారణంగానే నిస్పృహతో అర్నాబ్ తన తల్లిని చంపేసి, తాను ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని తెలిపారు. రాయ్గఢ్ పోలీసులు కేసును తిరగదోడటం చట్టబద్ధంగా లేదని వాదించారు.
ఇటీవలి కాలంలో మహారాష్ట్ర పోలీసులు అర్నాబ్పైనా, రిపబ్లిక్ టీవీపైనా తరచూ కేసులు పెడుతూ వస్తున్నారని సాల్వే గుర్తు చేశారు. మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ముఖ్ ప్రోద్బలంతోనే అర్నాబ్పై ఆత్మహత్య ప్రేరణ కేసు పెట్టారని, ఆయనను ఈ నెల 4వ తేదీన అరెస్టు చేశారని సాల్వే తెలిపారు. వ్యక్తిగత పూచీకత్తుతో అర్నాబ్ను సంబంధిత మెజిస్ట్రేట్ విడుదల చేసి ఉండాల్సిందని తెలిపారు. కేసును మహారాష్ట్ర పోలీసుల నుంచి సిబిఐకి బదిలీ చేయాలని లాయర్ ఈ సందర్భంగా సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. బెయిల్పై అర్నాబ్ను వెంటనే విడుదల చేస్తే కొంపలు మునిగి ఉండేవేమి కావని వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. ఇప్పటికే దిగువ కోర్టులలో కేసు విచారణ జరుగుతున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.
పోలీసు ఇంటరాగేషన్ ఎందుకుః జస్టిస్
ఈ కేసులో పోలీసులు ఎడిటర్ను ఇంటరాగేట్ చేయాల్సిన అవసరం ఉందా? అని న్యాయమూర్తి చంద్రచూడ్ ప్రశ్నించారు. కస్టడీలో ఉంచి విచారిస్తారా? అర్నాబ్ నేరుగా ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు ఆధారాలు ఉన్నాయా? అని నిలదీశారు. ఐపిసి 306 మేరకు కేసు పెట్టింది ఈ పరిధిలోనేనా? అని చంద్రచూడ్ మహారాష్ట్ర సర్కారు వైఖరి గురించి లాయర్ను అడిగారు. ఎఫ్ఐఆర్ పెండింగ్లో ఉంది కదా అని బెయిల్ ఇవ్వకపోవడం న్యాయమన్పించుకోదని తెలిపారు. తాను ఆ టీవీ ఛానల్ను చూడదల్చుకోలేదని, అయితే ఓ వ్యక్తి న్యాయం కోసం తమ వద్దకు వస్తే పౌరుడనే కోణంలో హక్కులను పరిరక్షించాల్సి ఉందన్నారు.