మహారాష్ట హోం మంత్రి వెల్లడి
బాలాకోట్ లోగుట్టు లొసుగు
కేంద్రం నుంచి వివరణ
నాగ్పూర్ : రిపబ్లిక్టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామి చాట్స్పై చర్యల గురించి మహారాష్ట్ర ప్రభుత్వం న్యాయ నిపుణుల సలహాలు తీసుకొంటోంది. ఈ విషయాన్ని రాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ముఖ్ శనివారం ఇక్కడ విలేకరుల సమావేశంలో తెలిపారు. బాలాకోట్ వైమానిక దాడులకు సంబంధించి అర్నబ్ వాట్సాప్ చాట్స్ విషయం వివాదాస్పదం అయింది. ఇది దేశ భద్రతా నిబంధనల ఉల్లంఘనకు వస్తోంది. దీనితో ఈ సంబంధిత చట్టం పరిధిలో అర్నబ్పై చట్టపరమైన చర్యల విషయాన్ని పరిశీలిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.
బాలాకోట్ దాడుల సున్నితమైన సమాచారాన్ని టీవీ ఎడిటర్ ఏ విధంగా సమీకరించుకున్నాడు? దీనిని ఆయనకు ఎవరు అందించారు? అనేవి కీలక అంశాలని, వీటిపై కేంద్ర ప్రభుత్వం నుంచి సమాచారం రాబట్టదల్చుకున్నామని కూడా దేశ్ముఖ్ తెలిపారు. గోస్వామికి బార్క్ మాజీ సారథి పార్థో దాస్గుప్తాకు మధ్య జరిగినట్లుగా చెపుతున్న వాట్సాప్ చాట్ విషయాన్ని హోం మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. బాలాకోట్ దాడుల గురించి అర్నబ్కు మూడు రోజుల ముందే తెలిసినట్లుగా ఈ వాట్సాప్ సంభాషణలతో తెలిసిందని, ఇది దిగ్భ్రాంతికరమైన విషయంగా మారినట్లు దేశ్ముఖ్ తెలిపారు. దీనిపై కేంద్రం వివరణను తాము తీసుకుంటామని, ఏ విధంగా గోస్వామికి ఇటువంటి కీలక సమాచారం అందిందనేది తెలియచేయాలని కోరుతామని మంత్రి వివరించారు. పాకిస్థాన్లోని లోతట్టు ప్రాంతాల్లోకి భారతీయ వైమానిక బలగాలు చొరబడి అత్యంత వ్యూహాత్మకంగా దాడులు జరపడం విశేష సంచలనానికి దారితీసింది.