వాషింగ్టన్ : ఇటీవలి దేశాధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ తిరుగులేని, నిర్ణయాత్మక, అపూర్వ విజయమే సాధించారని కమలా హారిస్ చెప్పారు. అమెరికా తదుపరి ఉపాధ్యక్షురాలిగా ఆమె ఎన్నికయ్యారు. ప్రెసిడెంట్ ట్రంప్ను బైడెన్ స్పష్టమైన ఆధిక్యతతోనే ఓడించారని, దేశ చరిత్రలో ఎప్పుడూ లేనంత స్థాయిలో ఓటింగ్ జరిగిందని కమలా గుర్తు చేశారు. 538 ఎలక్టోరల్ ఓట్లలో ట్రంప్ 279 ఓట్లు సాధించినట్లు న్యూయార్క్ టైమ్స్ ఇతర పత్రికలు పేర్కొన్న విషయాన్ని హారిస్ తెలిపారు. అమెరికా ఎన్నికలో ఓటమిని పొందలేదని ట్రంప్ ప్రకటిస్తూ వస్తున్నారు. ఈ దశలో బైడెన్ విజయంపై కమలా హారిస్ స్పష్టత ఇచ్చారు. ప్రస్తుత దశలో ట్రంప్ అడ్డుపుల్లలు చెల్లనేరవని కమలా హారిస్ తేల్చిచెప్పారు.
ఏడున్నర కోట్ల మంది అనుకూల తీర్పు వెలువరించారనే విషయాన్ని సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుని తమ ముందుకు వచ్చే కేసులపై తగు విధంగా వ్యవహరిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ప్రజాతీర్పును దెబ్బతీసేందుకు జరిగే ఎటువంటి యత్నాలను అయినా తాను , ప్రెసిడెంట్ ఎలెక్ట్ బైడెన్ తగు విధంగా తిప్పికొట్టి తీరుతామని తేల్చిచెప్పారు. దేశంలో ఇప్పుడే ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ప్రజలు స్పష్టమైన అభిప్రాయాన్ని తమ ఓటు ద్వారా వ్యక్తపరిచారని, ఈ విధంగా బైడెన్ విజయం రూఢీ అయిందన్నారు. జో బైడెన్కు పడ్డ ప్రతి ఓటు కూడా దేశంలో ఆరోగ్య పరిరక్షణ ప్రాధాన్యత ఓ హక్కు అనే దిశలో జరిగిన భావవ్యక్తీకరణ అన్నారు.