నోటిఫికేషన్ జారీచేసిన కేంద్రం
న్యూఢిల్లీ: నౌకాయన మంత్రిత్వశాఖ పేరును రేవులు, నౌకాయన, జలమార్గాల మంత్రిత్వశాఖగా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం బుధవారం నోటిఫికేషన్ జారీచేసింది. ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల చేసిన ప్రకటన మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. క్యాబినెట్ సచివాలయం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం మారిటైమ్ షిప్పింగ్-నావిగేషన్, మర్కంటైల్ మరైన్కు విద్య, శిక్షణ ఏర్పాటు, లైట్హౌస్లు, లైట్షిప్లు, రేవులు, షిప్పింగ్, నావిగేషన్ వంటి విభాగాలు ఈ మంత్రిత్వశాఖ పరిధిలో ఉంటాయి. అంతేగాక నౌకా నిర్మాణం, మరమ్మతుల పరిశ్రమ, నౌకలను శిథిలం చేయడం, చేపల వేటకు ఉపయోగించే పడవల నిర్మాణం తదితర పరిశ్రమలు కూడా దీని పరిధిలోనే ఉంటాయి. ముంబయి, కోల్కతా తదితర నగరాలలో ఉన్న పోర్ట్ ట్రస్టులు వంటి స్వతంత్ర సంస్థలు, ఇన్ల్యాండ్ వాటరవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వంటివి కూడా దీని పరిధిలోనే ఉంటాయి.