షహీన్బాగ్పై సుప్రీంకోర్టు తీర్పు
న్యూఢిల్లీ : నిరసనలకు అయినా మరే విషయాలకు అయినా ప్రజలకు చెందిన బహిరంగ స్థలాల్లో చేరడం కుదరదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దేశ రాజధాని ఢిల్లీలోని షహీన్బాగ్లో తిష్టవేసుకుని సాగుతున్న నిరసనలపర్వంపై అత్యున్నత న్యాయస్థానం బుధవారం ఘాటుగా స్పందిస్తూ తీర్పు వెలువరించింది. సిఎఎ వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలు ఈ మైదానంలో గత డిసెంబర్ నుంచి సాగుతున్నాయి. షహీన్బాగ్ వంటి బహిరంగ స్థలాలను ఈ విధంగా నిరవధికంగా ఆక్రమించుకున్నట్లు చేసుకుని ఉండటం ఆమోదయోగ్యం కాదని న్యాయమూర్తి ఎస్కె కౌల్ నాయకత్వంలోని ధర్మాసనం రూలింగ్ వెలువరించింది. నిరసనల హక్కు ఉంటుంది, అదే విధంగా ఉద్యమ సంబంధించిన ఇతరత్రా ప్రజా హక్కులు పాటించాల్సిన బాధ్యతలు పరిగణనలోకి తీసుకోవాలి. వీటి మధ్య సరైన సమతూకాన్ని పాటించాల్సి ఉంటుందని న్యాయమూర్తులు అనిరుద్ధ బోస్, కృష్ణ మురళీ కూడా సభ్యులుగా ఉన్న బెంచ్ స్పష్టం చేసింది.
ప్రజాస్వామ్యం, అసమ్మతి అవినాభావంగా సాగాల్సి ఉంటుందని, ప్రజాస్వామిక ప్రక్రియకు అనుసంధానంగా ఎవరైనా తమ అసమ్మతిని వివిధ అంశాలపై వ్యతిరేకతలను తెలియచేసుకోవచ్చునని ధర్మాసనం అభిప్రాయపడింది. మనం ప్రజాస్వామ్య ప్రక్రియలో ఉన్నాం. నిరసనలు ప్రతిఘటనలకు ఉద్యమాలకు వలసపాలకుల దశలో ఉన్నప్పటి పద్థతులకు దిగాల్సిన అవసరం లేదు. ఉద్యమించే వారు దీనిని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. షహీన్ బాగ్ ఉదంతం మాదిరిగా బహిరంగ స్థలాలను కైవసం చేసుకుని ఉండటం ఈ ప్రక్రియ అంతులేకుండా నిరవధికంగా సాగడం సరికాదని తెలిపారు. షహీన్ బాగ్ ప్రాంతంలో రాదారిని దిగ్బంధిస్తూ సాగిన యాంటి సిఎఎ నిరసనలకు వ్యతిరేకంగా దాఖలు అయిన పిటిషన్పై ధర్మాసనం తీర్పు వెలువరించింది. వీడియో కాన్పరెన్స్ ద్వారా తీర్పును వెలువరించారు. ఢిల్లీ పోలీసు ఇతరత్రా అధికార యంత్రాంగం సరిగ్గానే వ్యవహరించిందని బహిరంగ స్థలాల్లో చేరి తిష్ట వేసుకున్న వారిని ఖాళీ చేయించేందుకు యత్నించాల్సి వచ్చిందని తెలిపారు.
ఇటువంటి పరిస్థితిని చక్కదిద్దేందుకు సంబంధిత అధికార యంత్రాంగం వారి నిర్ణయాధికారాల పరిధిలో స్పందించాల్సి ఉంటుంది. ఇటువంటి వాటిపై చర్యలకు కోర్టుల వెనక నక్కాల్సిన అవసరం లేదని ధర్మాసనం స్పందించింది. సిఎఎను వ్యతిరేకిస్తూ షహీన్బాగ్ ప్రాంతంలోని రోడ్కు నిరసనకారులు ఆటంకాలు కల్పించడాన్ని లాయర్ అమిత్ సాహ్ని తమ పిటిషన్లో సవాలు చేశారు. కళింది కుంజ్ షహీన్బాగ్ మధ్య రాదారిలో బ్లాకేడ్ను తీసివేసి, ప్రజల రాకపోకలకు వీలు కల్పిస్తూ చర్యలు తీసుకోవాలని పిటిషనర్ ముందుగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే శాంతిభద్రతల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని తగు రీతిలో వ్యవహరించాలని హైకోర్టు స్థానిక అధికారులకు సూచించింది. దీనితో సంతృప్తి చెందని పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
supreme court verdict on shaheen bagh protest