వాషింగ్టన్ : అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేళ ట్రంప్ అధికార యంత్రాంగం హెచ్ 1 బి వీసాలపై మరిన్ని కొత్త ఆంక్షలను విధించింది. ఈ మేరకు తాజాగా అధికారిక ప్రకటన వెలువరించారు. అమెరికా వర్కర్ల ప్రయోజనాల కోణంలో ఈ వీసాలపై ఆంక్షలను అమలులోకి తేనున్నట్లు తెలిపారు. దేశ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ (డిహెచ్ఎస్) తమ మధ్యంతర తుది హెచ్ 1 బి వీసాల రూల్స్ను వెలువరించింది. ఈ వీసా విశ్వసనీయత సమగ్రతకు భంగం వాటిల్లకుండా వ్యవహరిస్తూ కేవలం అర్హులైన వారికే హెచ్ 1 బి వీసాలు వచ్చేలా చేసేలా నిబంధనలను సవరించినట్లు అధికార ప్రకటనలో తెలిపారు. హెచ్ 1 బి పద్ధతులలో తిరిగి మార్పులతో భారతీయ యువ ఐటి నిపుణులపై మరింత ప్రభావం పడుతుంది.ఇప్పటికే సాగుతున్న అనిశ్చితి కొనసాగుతుంది. హెచ్ 1 బి వీసాలను కుదిస్తున్నట్లు తెలిపారు.
విదేశాలకు చెందిన నైపుణ్య కార్మికులకు ఇచ్చే వీసాలను పరిమితం చేస్తున్నట్లు పేర్కొన్నారు. కరోనాతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థతో దేశంలో ఉద్యోగ కల్పన భారాన్ని తట్టుకునేందుకు వీసా విధానాలలో మార్పులు అనివార్యం అయినట్లు తెలిపారు. ఎవరెవరికి వీసాలు జారీ చేయాలి? వారికి ఎంత జీతం ఖరారు చేయాలనేది త్వరలో ఖరారు చేసి వివరిస్తారని తెలిపారు. సాధారణంగా ప్రతి ఏటా అమెరికా ప్రభుత్వం సుమారు 85వేల హెచ్1బి వీసాలు జారీ చేస్తుంది. అయితే తాజా నియమావళి ప్రకారం ఈ సంఖ్యను పావువంతు తగ్గిస్తున్నట్లు హోమ్ల్యాండ్ తాత్కాలిక సెక్రెటరీ కెన్ కుసివెల్లి తెలిపారు.