Sunday, April 28, 2024

గొర్రెల పంపిణీ వేగవంతం: మంత్రి తలసాని

- Advertisement -
- Advertisement -

Talasani review meeting on Sheep distribution

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై అందజేస్తున్న గొర్రెల యూనిట్‌ల పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని పశుసంవర్ధక, మత్స పరిశ్రమ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆ శాఖ అధికారులను ఆదేశించారు. గొర్రెల యూనిట్ల కోసం లబ్దిదారులు తమ వంతు వాటా నిధులు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో పశుసంవర్ధక, మత్స్య, శాఖల అధికారులతో మంత్రి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా, షీఫ్ ఫెడరేషన్ ఎండి రాంచందర్‌తోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి తలసాని మాట్లాడుతూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మానస పుత్రికగా భావించే ఈ పథకం ద్వారా గొల్ల, కురుమలకు గొర్రెల యూనిట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. గొర్రెల యూనిట్ ల పంపిణీ లో ప్రభుత్వ వాటా 75 శాతం కాగా, 25 శాతం లబ్దిదారుడి వాటా అని తెలిపారు. మొదటి విడతలో 5 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసి గొర్రెల యూనిట్లను పంపిణీ చేసినట్లు చెప్పారు. పెరిగిన ధరలను దృష్టిలో ఉంచుకొని యూనిట్ ధరను పెంచాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కు విన్నవించగా, వెంటనే స్పందించి యూనిట్ గొర్రెల ధరను లక్షా 25 వేల రూపాయల నుండి లక్షా 75 వేల రూపాయలకు పెంచారని వివరించారు. ఇప్పటికే తమ వాటా నిధులు చెల్లించిన 4,761 మంది లబ్దిదారులు పెరిగిన యూనిట్ ధరకు అనుగుణంగా 12,500 రూపాయల అదనపు వాటా నిధులు చెల్లించారని తెలిపారు. వీరిలో 1119 మందికి గొర్రెల యూనిట్ లను పంపిణీ చేసినట్లు వివరించారు. అర్హులైన లబ్దిదారులందరు తమ వంతు వాటా నిధులు చెల్లించి గొర్రెల యూనిట్ లను పొందాలని కోరారు. వాటా నిధులు చెల్లించిన లబ్దిదారులకు వెంట వెంటనే గొర్రెల యూనిట్ లను అందజేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు.
20వ తేదీలోగా చేప పిల్లల పంపిణీ పూర్తి చేయాలి:
రాష్ట్రంలో మత్స్యకారుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేప, రొయ్య పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని వేగంగా పూర్తి చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మత్స్య శాఖ అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలోని 18,336 నీటి వనరుల్లో 50.60 కోట్ల చేప పిల్లలను విడుదల చేసినట్టు తెలిపారు.రాష్ట్రంలోని మరో 30 రిజర్వాయర్ లలో రూ.1.92 కోట్ల రొయ్య పిల్లలను విడుదల చేసినట్లు వివరించారు. ప్రభుత్వ నిబంధలకు అనుగుణంగా ఉన్న చేప, రొయ్య పిల్లలను మాత్రమే విడుదల చేయాలని, చేపపిల్లల విడుదల ప్రక్రియ ను తప్పకుండా వీడియో, ఫోటోగ్రఫీ చేయాలని ఆదేశించారు. ఎవరైనా నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించినట్లు తమ దృష్టికి వస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు. చేప, రొయ్య పిల్లల విడుదల కార్యక్రమంలో ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు, ఎంపిలు, రాజ్యసభ సభ్యులు ఇతర ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు.

Talasani review meeting on Sheep distribution

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News