Sunday, April 28, 2024

తమిళనాడులో మరో 33 ఒమిక్రాన్ కేసులు..

- Advertisement -
- Advertisement -

తమిళనాడులో మరో 33 ఒమిక్రాన్ కేసులు
చెన్నైలో 26 కేసుల నమోదు
చెన్నై: తమిళనాడులో కొత్తగా 33 మందికి ఒమిక్రాన్ వేరియంట్ సోకింది. రాష్ట్రంలో తొలి ఒమిక్రాన్ కేసు ఈనెల 15న నైజీరియా నుంచి వచ్చిన 47 ఏళ్ల వ్యక్తికి నిర్ధారించారు. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి తమిళనాడుకు వచ్చిన వారికి, వారితో సన్నిహితంగా ఉన్నవారికి పరీక్షలు చేయగా 33 మందికి కొత్తగా నిర్ధారణ అయింది. ఇప్పటికే ఒకరికి ఒమిక్రాన్ సోకగా, తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 34 కు చేరినట్టు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి మాసుబ్రమణియన్ వెల్లడించారు. మరో 24 మంది పరీక్ష ఫలితాలు రావాల్సి ఉందని తెలిపారు. ప్రస్తుతం నిర్ధారణ అయిన 34 మంది వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్టు వెల్లడించారు.. రాష్ట్రంలో చెన్నైలో అత్యధికంగా 26 మందికి, మధురైలో నలుగురికి, తిరువణ్ణామలైలో ఇద్దరికి, సేలంలో ఒకరికి ఒమిక్రాన్ సోకినట్టు తెలిపారు.

తాజా ఒమిక్రాన్ కేసుల నమోదుతో జాతీయ స్థాయిలో తమిళనాడు మూడో స్థానంలో ఉందని చెప్పారు. ఇప్పటివరకు 4275 మందికి పరీక్షలు నిర్వహించినట్టు వెల్లడించారు. 34 మందికి ఎటువంటి తీవ్ర లక్షణాలు లేవని, కొందరికి తల తిరగడం, గొంతునొప్పి, వంటి లక్షణాలతో బాధపడుతున్నారని మంత్రి పేర్కొన్నారు. ఒక్కసారిగా 33 మందికి ఒమిక్రాన్ నిర్ధారణ కావడంతో తమిళనాడులో ముఖ్యంగా చెన్నైలో ప్రభుత్వం కఠిన చర్యల అమలుకు సిద్ధమౌతోంది. నూతన సంవత్సరం సందర్బంగా అధికంగా ప్రజలు గుమిగూడే అవకాశం ఉండడంతో 31, 1న బీచ్‌ల్లో సందర్శకులను అనుమతించ కూడదని ప్రభుత్వం నిర్ణయించింది. చెన్నై విమానాశ్రయంలో నిఘాను కఠినతరం చేశారు. విదేశాల నుంచి చెన్నై వచ్చే ప్రయాణికులకు పరీక్షలు తప్పనిసరి చేశారు. నెగెటివ్ వచ్చినా కూడా వారిని నిరంతర పర్యవేక్షణలో ఉంచుతున్నట్టు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.

Tamil Nadu Reports 33 new Omicron Cases

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News