Saturday, May 4, 2024

టిడిపి అభ్యర్థులకు బి ఫాంలను అందించిన చంద్రబాబు

- Advertisement -
- Advertisement -

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏపిలో ఎన్నికల్లో పోటీ చేస్తున్న టిడిపి పార్టీ అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులకు బి.ఫాంలు అందించారు. ఉండవల్లిలోని తన నివాసంలో బి. ఫాంలు ఇచ్చారు. ఈ సందర్భంగా పార్టీ అభ్యర్థులతో చంద్రబాబు నాయుడు ఈ మేరకు ప్రతిజ్ఞ చేయించారు. శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలు పెట్టి అభ్యర్ధులకు బిఫాంలు అందించారు. కాగా మంగళగిరి టిడిపి అభ్యర్థిగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ సందర్భంగా బీఫామ్ అందుకున్నారు.

హైటెక్ సిటీ నిర్మాణంతో విశ్వనగరంగా హైదరాబాద్ : నారా బ్రాహ్మణి
కాగా అటు ఏపిలోని మంగళగిరిలో నారా బ్రాహ్మణి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సమర్థుడైన పాలకుడు ఉంటేనే ప్రజలకు సుపరిపాలన అందుతుందని, గత అయిదేళ్లుగా ఏపిలో పాలన సాగిస్తున్న వారు మూడుముక్కలాటతో ప్రజల బతుకులను ఛిద్రం చేశారని నారా బ్రాహ్మణి పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి రూరల్ బేతపూడి మల్లెతోటల్లో పనిచేస్తున్న మహిళా కూలీలను కలిసిన బ్రాహ్మణి వారి సాధకబాధకాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బ్రాహ్మణి మాట్లాడుతూ ఒకప్పుడు రాళ్లురప్పలతో నిండిన హైదరాబాద్‌ను హైటెక్ సిటీ నిర్మాణం ద్వారా విశ్వనగరంగా మార్చిన దార్శనికుడు చంద్రబాబునాయుడు అన్నారు. ఎల్లప్పుడూ ప్రజాక్షేమాన్ని కాంక్షించే చంద్రబాబుపై తప్పుడు కేసులుపెట్టి 53 రోజులపాటు అక్రమంగా జైలులో నిర్భందించారని, కక్షపూరిత రాజకీయాలకు రాబోయే ఎన్నికల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరగిపోయాయని, భద్రతలేక భయంతో బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారన్నారు.

నాసిరకం మద్యం కారణంగా నిరుపేద కుటుంబాలు నాశనమవుతున్నాయని, ఒకప్పుడు అన్నపూర్ణగా ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని డ్రగ్స్, గంజాయి క్యాపిటల్ గా మార్చేశారని బ్రాహ్మణి మండిపడ్డారు. చంద్రబాబు సిఎం అయ్యాక మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతారన్నారు. భారీగా పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, ఇంటి పన్నులు, కరెంటు బిల్లులతో ప్రజలపై భారంమోపారన్నారు. అమరావతి విధ్వంసంతో ఇక్కడి ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయని, పేద, మధ్య తరగతి ప్రజల ఆదాయాలు పడిపోయాయన్నారు. రాబోయే ఎన్నికల్లో అందరి ఆశీస్సులతో చంద్రబాబు సిఎం అయ్యాక రాజధాని నిర్మాణం చేపట్టి అమరావతి ప్రాంతానికి గతవైభవం తెస్తారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమలు రప్పించి యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తారని, ఏపి ప్రజలు రెండునెలలు ఓపికపడితే ప్రజాప్రభుత్వం అధికారంలోకి వస్తుందని అన్నారు. అప్పుడు అన్నివర్గాల ప్రజల కష్టాలు తీరుతాయన్నారు.

మంగళగిరి నియోజకవర్గంలో ఇబ్బందుల్లో ఉన్న చేనేతలను ఆదుకునేందుకు నారా లోకేష్ టాటా తనేరియాతో ఒప్పందం చేసుకుని వీవర్స్ కోసం చర్యలు తీసుకున్నారన్నారు. అధునాతన మగ్గాలు, డిజైన్లతోపాటు మార్కెటింగ్ సౌకర్యం కల్పించి చేనేతల ఆదాయం పెంచేందుకు కృషిచేస్తున్నారని, నారా లోకేష్ చేస్తున్న మంచి పనుల్లో ఇదో చిన్న కార్యక్రమం మాత్రమేనన్నారు. లోకేష్ విజన్ అమలైతే మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం దేశంలోనే నెం.1 గా తయారవుతుందని నారా బ్రాహ్మణి అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News