Monday, May 6, 2024

దళిత విద్యార్థులతో సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేయించిన ఉపాధ్యాయుల అరెస్ట్

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : కర్ణాటక లోని ఓ రెసిడెన్షియల్ పాఠశాల లోని దళిత విద్యార్థులతో ప్రిన్సిపాల్, టీచర్ సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేయించిన సంఘటన జరిగింది. విద్యార్థులకు శిక్షగా ఈ పనిచేయించినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేగింది. బాధ్యులైన ఉపాధ్యాయులను పోలీస్‌లు అరెస్ట్ చేశారు. కోలార్ జిల్లా లోని మొరార్జీదేశాయ్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఈ సంఘటన వెలుగు లోకి వచ్చింది. ఈ పాఠశాలలో 19 మంది బాలికలతోసహా 243 మంది విద్యార్థులు ఉన్నారు.

అయితే మొత్తం నలుగురు విద్యార్థులను సెప్టిక్ ట్యాంక్ లోకి దింపి శుభ్రం చేయించినట్టు తెలుస్తోంది. ఇదే స్కూలుకు సంబంధించి మరో వీడియోలో కొందరు విద్యార్థులను బ్యాగ్‌లు ధరించి చేతులు పైకెత్తి నిలబడాలంటూ శిక్ష విధించినట్టు వెలుగులోకి వచ్చింది. ఈ షాకింగ్ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్వయంగా ముఖ్యమంత్రి సిద్ద రామయ్య జోక్యం చేసుకున్నారు. బాధ్యులైన ప్రిన్సిపాల్ భారతమ్మ, టీచర్ మునియప్పలను పోలీస్‌లు అదుపు లోకి తీసుకున్నారు. వృత్తిపై నిర్లక్షం వహించినందుకు వారిని సస్పెండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరో నలుగురు కాంట్రాక్ట్ సిబ్బందిని కూడా విధుల నుంచి తొలగించారు. మనుషులతో సెప్టిక్ ట్యాంక్ మురుగును శుభ్రం చేయించడాన్ని కేంద్ర ప్రభుత్వం కొన్నేళ్ల క్రితమే నిషేధించింది. ఈ విధంగా శుభ్రం చేసే పనుల్లో పలువురుప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా వెలుగు చూశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News