Sunday, May 5, 2024

విద్యార్థుల జీవితాలకు దిక్సూచిగా అధ్యాపకులు : గవర్నర్ తమిళిసై

- Advertisement -
- Advertisement -

ఘనంగా ఓయూ 83వ స్నాతకోత్సవం

మన తెలంగాణ / హైదరాబాద్ : విద్యార్థుల జీవితాలకు అధ్యాపకులు దిక్సూచిగా నిలుస్తారని ఉస్మానియా విశ్వవిద్యాలయం చాన్సలర్, గవర్నర్ డా. తమిళిసై సౌందర రాజన్ అన్నారు. ప్రతిష్టాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయ 83వ స్నాతకోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. ఉస్మానియా చరిత్రలో తొలిసారిగా ఒకే సారి 1024 మంది విద్యార్థులు పిహెచ్‌డి పట్టా పొందే ఘట్టానికి ఠాగూర్ ఆడిటోరియం వేదికగా నిలిచింది. విశ్వవిద్యాలయ పరిధిలో ఆయా విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మరో 58 మంది విద్యార్థులు వర్శిటీ ఛాన్స్‌లర్, రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ చేతుల మీదుగా బంగారు పతకాలు కైవసం చేసుకున్నారు.

ఉస్మానియా క్యాంపస్ లోని ఇంజినీరింగ్ కళాశాలలో చదివి ప్రపంచంలోనే అత్యుత్తమ కంపెనీల్లో ఒకటైన అడోబ్, అధ్యక్షుడిగా, ముఖ్య కార్యనిర్వహణాధికారి స్థాయికి ఎదిగిన శంతను నారాయణ్ కు ఉస్మానియా విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. గవర్నర్ చేతుల మీదుగా ఆయన గౌరవ డాక్టరేట్ పట్టా అందుకున్నారు. గతేడాది భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్‌వి రమణ గౌరవ డాక్టరేట్ అందుకున్న విషయం తెలిసిందే. ఓయూ ఉపకులపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రొఫెసర్ దండబోయిన రవిందర్ యాదవ్ నాయకత్వంలో వరుసగా మూడో ఏడాది స్నాతకోత్సవం ఘనంగా నిర్వహించారు. పిహెచ్‌డి పూర్తి చేసిన 1,024 మంది విద్యార్థులు ముఖ్య అతిథి శంతను నారాయణ్, ఉపకులపతి ఆచార్య దండెబోయిన రవిందర్ యాదవ్ చేతుల మీదుగా పట్టాలు అందుకున్నారు.

విద్యార్థుల ఉత్తేజం, కేరింతలతో ఠాగూర్ ఆడిటోరియం పరిసరాలు మారుమోగాయి. ఈ సందర్భంగా ఓయూ ఛాన్సలర్, గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ మాట్లాడుతూ ఓయూ స్నాతకోత్సవం ద్వారా అడోబ్ సిఈఓ శంతను నారాయణ్ ను కలవటం సంతోషంగా ఉందని అన్నారు. ఓయూ ఉపకులపతి రవీందర్ పనితీరును ప్రశంసించిన గవర్నర్ వరుసగా మూడు సంవత్సరాలు స్నాతకోత్సవం నిర్వహించటం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. క్రమం తప్పకుండా విద్యాసంస్థలు స్నాతకోత్సవాలు జరుపుకోవాలని సూచించారు. ఎంతో మంది ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దిన అధ్యాపకులకు తలవంచి నమస్కరిస్తున్నాని అన్నారు. విద్యార్థుల జీవితాలకు అధ్యాపకులు దిక్సూచిగా నిలుస్తారని చెప్పుకొచ్చారు. జీవితం సవాళ్లతో కూడుకుంటుందని, ప్రతి సవాల్ ను అధిగమించినప్పుడే అద్భుతాలు సృష్టించగలమని అన్నారు. ఎలాంటి సందర్బంలోనైనా అత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని సూచించారు. ప్రతి సందర్భంలోనూ ధైర్యంతో, సంతోషంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ప్రతి విభాగంలోనూ బంగారు పతకాలు అందించేందుకు దాతలు, పారిశ్రామికవేత్తలు, పూర్వ విద్యార్థులు ముందుకు రావాలని గవర్నర్ పిలుపునిచ్చారు. విజయానికి ఎలాంటి దగ్గరి దారులు లేవని, శ్రమ, పట్టుదల ద్వారానే విజయతీరాలకు చేరుకోవాలని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ స్వతహాగా ప్రేరణ పొందుతూ ఎదగాలని అన్నారు. 83వ స్నాతకోత్సవ ముఖ్య అతిథి, గౌరవ డాక్టరేట్ పొందిన అడోబ్ సిఈఓ శంతను నారాయణ్ మాట్లాడుతూ ఉస్మానియాతో తన కుటుంబానికి ఎంతో అనుబంధం ఉందని స్పష్టం చేశారు. ఇక్కడ చదువుకుని ప్రపంచ అగ్రగామి సంస్థకు నాయకత్వం వహించటం ఆనందం గా ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరికీ ఉన్నత స్థాయికి ఎదిగే సామర్ధ్యం ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ కష్టపడి ఉన్నత స్థాయికి చేరుకోవాలని పిలుపునిచ్చారు. అడోబ్ ఉత్పత్తుల్లో అడోబ్ ఫొటోషాప్ అత్యంత ప్రాచుర్యం పొందిందని గుర్తు చేశారు. వినూత్న ఆలోచలతో 42ఏళ్ల క్రితం అమెరికా వెళ్లానని, ఉస్మానియాలో చదివిన రోజులను గుర్తు చేసుకున్నారు. వృత్తిపరమైన ప్రపంచంలో విజయాలు, ఆవిష్కరణలకు అంతులేని అవకాశాలున్నాయని గుర్తు చేశారు. మార్పును స్వీకరిస్తూ, ఉద్దేశాలకు కట్టుబడి, స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మేధోపరమైన ఆలోచనలతో ఎంచుకున్న మార్గానికి నాయకత్వం వహించే దిశగా కృషి చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య దండెబోయిన రవీందర్ మాట్లాడుతూ ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని ప్రపంచ స్థాయిలో ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకుని ప్రపంచ గర్వించే స్థాయికి ఎదిగిన శంతను నారాయణ్ కు గౌరవ డాక్టరేట్ అందించటం గర్వంగా ఉందని వెల్లడించారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, అడోబ్ సీఈఓ శంతను నారాయణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఉస్మానియా అభివృద్ధి కోసం 21 పాయింట్ ఫార్ములాతో తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ పి. లక్ష్మీనారాయణ, పాలకవర్గ సభ్యులు, పన్నెండు ఫ్యాకల్టీల డీన్లు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ స్నాతకోత్సవంలో కీలక భూమిక పోషించారు.

OU 83rd Convocation

TAgore Auditorium

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News